చర్చకు సై అంటున్న నేతలు.. రాష్ట్రంలో ఒక్కసారిగా పెరిగిన పొలిటికల్ హీట్

by Disha Web Desk 2 |
చర్చకు సై అంటున్న నేతలు.. రాష్ట్రంలో ఒక్కసారిగా పెరిగిన పొలిటికల్ హీట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మొదలైంది. పార్లమెంటు ఎన్నికల వేళ కృష్ణా జలాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మీ ప్రభుత్వ పాలనలోనే అంటే... మీ పాలనలో తెలంగాణ ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగింతకు అగ్రిమెంట్ రాసుకున్నారని పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. త్వరలో జరుగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ కృష్ణాజలాలపై రసవత్తరంగా చర్చ కొనసాగనుంది. ఇప్పటికే ఇరుపార్టీల నేతలు చర్చకుసై అంటున్నారు.

బీఆర్ఎస్ ఉద్యమ కార్యాచరణ

కేఆర్ఎంబీకి రాష్ట్ర ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించిందనే వార్తలతో ఒక్కసారిగా రాజకీయ హీట్ స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవద్దని విమర్శలకు పదును పెట్టింది. కృష్ణాబోర్డుకు శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులను అప్పగిస్తే రాష్ట్రం హక్కులను కోల్పోతుందని మాజీ సీఎం కేసీఆర్ పేర్కొంటున్నారు. దీనిపై ఉద్యమ కార్యాచరణను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులను అప్పగించేందుకు ఒప్పుకోలేదని, బలవంతంగా గెజిట్ అమలుచేయడానికి యత్నిస్తే కృష్ణాజలాల్లో 50 శాతం వాటా కోసం పట్టుబట్టామని చెబుతున్నారు. నీటి పంపకాలపై అపెక్స్ కౌన్సిల్‌లో తేల్చాలని కేఆర్ఎంబీ సమావేశంలో నిర్ణయించారని బీఆర్ఎస్ పేర్కొంటోంది.

ఆ తర్వాత అపెక్స్​కౌన్సిల్​సమావేశమే కాలేదని, కానీ కాంగ్రెస్​ప్రభుత్వం శ్రీశైలం, నాగార్జునసాగర్​ప్రాజెక్టుల్లోని 10 ఔట్​లెట్లను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుందని మండిపడుతోంది. కాగా రాష్ట్ర పునర్విభజన చట్టం చేసినప్పుడే కృష్ణా, గోదావరి జలాల పంపిణీని కేంద్రానికి అప్పగిస్తున్నట్లు కేసీఆర్ ఒప్పుకున్నారని కాంగ్రెస్ పేర్కొంటోంది. కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడే ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడానికి పునాదిపడిందని మండిపడుతోంది. 2015లో జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో తెలంగాణకు 299, ఏపీకి 511 టీఎంసీలు కేటాయించేందుకు కేసీఆర్, హరీశ్ రావు సంతకాలు చేశారని, 50 శాతం వాటా అడగకుండా అన్యాయం చేశారని ధ్వజమెత్తుతోంది. 2022లో కేఆర్ఎంబీకి 15 ప్రాజెక్టులను అప్పగిస్తున్నామని సమావేశంలో కేసీఆర్ అంగీకరించారని, ఇప్పుడు డ్రామా చేస్తున్నారని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పోతిరెడ్డి పాడు, రాయలసీమ ప్రాజెక్టులకు నీటి తరలింపునకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆరోపిస్తోంది.

రేవంత్ వర్సెస్ హరీశ్ రావు

జలాల అంశం సీఎం రేవంత్ వర్సెస్ మాజీ మంత్రి హరీశ్ రావుగా మారింది. ఇరువురు అసెంబ్లీలో కృష్ణాజలాలపై చర్చకు సై అంటే సై అంటున్నారు. ప్రాజెక్టులపై రెండు రోజులు చర్చిద్దామని, కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సమావేశాలకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అధికారం కోల్పోయి దిక్కుతోచక మామా అల్లుళ్లు కాంగ్రెస్‌ను బదనాం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టు జలాలపై చర్చ పెడదాం, రెండు రోజులు ప్రాజెక్టుల శ్వేతపత్రంపై చర్చిద్దాం.. చాలవంటే సమావేశాలను పొడగిద్దాం.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్, కవిత రావు అందరూ రావాలని సూచించారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలకు హరీశ్ కౌంటర్ ఇచ్చారు. సబ్జెక్ట్ లేక రేవంత్ రెడ్డి చవకబారు మాటలు మాట్లాడుతున్నారన్నారు. ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ పెట్టు, దిమ్మతిరిగే సమాధానం చెప్తాం బిడ్డా అంటూ సవాల్‌ విసిరారు.

కౌంటర్ ఎటాక్‌కు సన్నద్ధమవుతున్న బీఆర్ఎస్

కాంగ్రెస్ సీఎం, మంత్రులు చేసే వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. చేసే ప్రతి విమర్శకు కౌంటర్ ఇవ్వాలని పార్టీ అధిష్టానం నేతలకు సూచించినట్లు సమాచారం. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ వెంటనే రియాక్టు కావాలని, బీఆర్ఎస్ పాలనలో చేసిన ప్రతి అభివృద్ధితో పాటు కృష్ణాజలాల్లోనూ వాటాపై కొట్లాడిన అంశాన్ని, ఎంపీలు సైతం పార్లమెంటులో ప్రస్తావించిన వీడియోలను సైతం పోస్టులు పెట్టాలని కేడర్‌కు ఆదేశాలిచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాదు మీడియా వేదికగా సమావేశాలు పెట్టి తిప్పికొట్టాలని, ప్రతీది ప్రజలకు చేరేలా చూడాలని సూచించింది. కృష్ణాజలాల అంశాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పార్లమెంటు ఎన్నికల్లో రాజకీయ అస్త్రంగా మలుచుకోవాలని భావిస్తున్నాయి.

Next Story

Most Viewed