కాస్త ధైర్యం చేసి ఉంటే ఆ ఆరుగురు బతికేవారు.. ‘స్వప్నలోక్’ బాధితుడు సంజీవరెడ్డి

by Disha Web Desk 2 |
కాస్త ధైర్యం చేసి ఉంటే ఆ ఆరుగురు బతికేవారు.. ‘స్వప్నలోక్’ బాధితుడు సంజీవరెడ్డి
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ‘‘అగ్నిమాపక సిబ్బంది కాస్త ధైర్యం చేసి ఉంటే ఆ ఆరుగురు ప్రాణాలతో బతికి బయటపడేవారు.. కనీసం బ్రోంటో స్కై లిఫ్ట్ (హైడ్రాలిక్​క్రేన్) సకాలంలో వచ్చినా వాళ్లకు నిండు నూరేళ్లు నిండేవి కావు’’ సికింద్రాబాద్​స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదం నుంచి ప్రాణాలతో బతికి బయటపడ్డ సంజీవరెడ్డి చెప్పిన మాటలివి. తాను కూడా చచ్చిపోతాననే అనుకున్నానని ఆయన చెప్పాడు. భవనం పైనుంచి కిందకు దూకేద్దామని కూడా అనుకున్నట్టు చెప్పిన సంజీవరెడ్డి ఆ పని చేసి ఉంటే ప్రాణాలతో బతికి బయటపడేవాన్ని కాదన్నారు. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి 7 గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.

మూడో అంతస్తులో లిఫ్ట్​వద్ద జరిగిన షాట్​సర్క్యూట్​కారణంగా ఎగిసిన మంటలు చూస్తుండగానే దావానలంలా పై అంతస్తులకు ఎగబాకాయి. కాగా, ప్రమాదం గురించి తెలిసి అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫైరింజన్లతో అక్కడికి రాత్రి 7.45 గంటల సమయంలో అక్కడికి చేరుకున్నారు. అప్పటికే మంటలు నాలుగు, అయిదు అంతస్తులకు వ్యాపించాయి. వచ్చీరాగానే సిబ్బంది మంటలను అదుపుచేయడం ప్రారంభించారు. అయితే, ఫైరింజిన్ వాటర్ నాలుగో అంతస్తు వరకు కూడా చేరుకోలేదు. దాంతో 18 అంతస్తుల వరకు రీచ్​ఉండే బ్రోంటో స్కై లిఫ్ట్​క్రేన్‌కు కబురు చేశారు. ఇది వచ్చిన తరువాత అయిదు, ఆరు అంతస్తుల వరకు చేరుకున్న సిబ్బంది మంటలు ఆర్పటానికి నీళ్లు చిమ్మారు. ఈ క్రమంలో కొంతమేర మంటలు అదుపులోకి వచ్చాయి. ఇదే అదనుగా రెస్క్యూటీం సిబ్బంది అయిదో అంతస్తులోకి ప్రవేశించి మొదట ముగ్గురిని ఆ తరువాత మరో ఇద్దరిని రక్షించి కిందకు చేర్చారు.

ఆ సమయంలో సంజీవరెడ్డి అదే అంతస్తులోని బాల్కనీలో నిలబడి కింద ఉన్న వారికి తన మొబైల్ లైట్‌ను చూపిస్తూ కాపాడండి అంటూ కేకలు పెడుతున్నాడు. అయిదో అంతస్తుకు వచ్చిన రెస్క్యూ టీం సిబ్బందిని చూసి అదే ఫ్లోర్‌లో ఉన్న ఈ ట్రేడింగ్​ఆఫీస్‌లో కొందరు చిక్కుకుపోయారని.. వారితోపాటు తనను కూడా కాపాడాలని వేడుకున్నాడు. ఈ క్రమంలో రెస్క్యూ టీం సిబ్బంది ఈ ట్రేడింగ్​ఆఫీస్​వైపు ముందుకు కదిలారని సంజీవరెడ్డి చెప్పాడు. అప్పటికే దట్టంగా పొగ అలుముకోవటంతో మరింత ముందుకు వెళ్లే సాహసం చేయలేకపోయిన రెస్క్యూ టీం సిబ్బంది వెనక్కి వెళ్లిపోయారని తెలిపాడు. ఆ సమయంలో అక్కడ మంటలు పెద్దగా విస్తరించలేదని, కేవలం పొగ మాత్రమే కమ్ముకుని ఉండెనని వివరించాడు.

అన్ని సన్నాహాలతో పైకి వచ్చిన రెస్క్యూ టీం కొంచెం సాహసాన్ని కనబరిచి ఉంటే ఆఫీస్‌లోని బాత్రూంలో దాక్కున్న శివ, ప్రమీల, వెన్నెల, శ్రావణి, త్రివేణి, ప్రశాంత్​లను కాపాడగలిగి ఉండేవారన్నాడు. రాత్రి 11గంటలకు మంటలను దాదాపుగా అదుపులోకి తీసుకొచ్చి.. పొగ తగ్గిన తరువాత రెస్క్యూ టీం ఈ ట్రేడింగ్​ఆఫీస్​లోకి వెళ్లిందని చెబుతూ అప్పటికే పొగ కారణంగా ఊపిరి పీల్చుకోలేక ఆ ఆరుగురు చనిపోయినట్టు ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పాడు. ఓ దశలో తాను కూడా అగ్నిప్రమాదంలో చనిపోతానని అనుకున్నట్టు తెలిపాడు. ఈ క్రమంలో అయిదో అంతస్తు నుంచి కిందకు దూకేద్దామని అనుకున్నట్టు చెప్పాడు. అయితే, తన వద్ద పని చేస్తున్న ఉద్యోగి నుంచి తన నెంబర్​తీసుకున్న రఫీ అనే వ్యక్తి కిందకు దూకొద్దని సూచించినట్టు తెలిపాడు. భారీ క్రేన్​(బ్రోంటో స్కై లిఫ్ట్) వస్తోందని, ధైర్యంగా ఉండాలని చెప్పాడన్నాడు. దాంతో కిందకు దూకాలన్న నిర్ణయాన్ని మార్చుకున్నట్టు చెప్పాడు. క్రేన్​రాగానే పైకి వచ్చిన రెస్క్యూ టీం తనతోపాటు తుకారాంగేట్​పోలీస్​స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వ్యక్తి తల్లిదండ్రులను కాపాది కిందకు తీసుకొచ్చినట్టు వివరించాడు.


Next Story

Most Viewed