కేటీఆర్ సార్.. స్టడీమెటిరియల్ ఎక్కడా?

by Dishafeatures2 |
కేటీఆర్ సార్.. స్టడీమెటిరియల్ ఎక్కడా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారం లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్ ను ప్రశ్నార్థకంగా మార్చింది. ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తు జరుపుతోంది. మరోవైపు అభ్యర్థులెవరూ అధైర్య పడవద్దని మంత్రి చెప్పిన మాటలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. క్వశ్చన్ పేపర్ల లీక్ అంశంలో మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీకి వారం గడుస్తున్నా అమలు కాకపోవడంపై నిరుద్యోగులలో మరోసారి సందేహాలు తలెత్తుతున్నాయి. అంతా పారదర్శకంగా జరిగేందుకే పరీక్షలను రద్దు చేశామని గత వారం ప్రెస్ మీట్ లో మంత్రి కేటీఆర్ చెప్పారు. విద్యార్థులకు నష్టం జరగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని ఈ నాలుగు పరీక్షలకు సంబంధించిన కోచింగ్ మెటీరియల్ ను ఉచితంగా ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు.

రాబోయే రెండు మూడు రోజుల్లోనే ఈ మెటీరియల్ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే మంత్రి హామీ ఇచ్చి ఇప్పటికే వారం కావొస్తున్నా ఆ దిశగా ప్రయత్నాలు జరగకపోవడం అభ్యర్థుల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టడీ సర్కిళ్లను కూడా బలోపేతం చేసి అవి 24 గంటలు తెరిచి ఉంచుతామని అందులో అభ్యర్థులకు ఉచితంగా భోజన సౌకర్యం కల్పిస్తామని కూడా మంత్రి చెప్పారు. కేసు దర్యాప్తు వేగవంతం చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం మాటలు ఎలా ఉన్నా.. పరీక్షల విషయంలో తదుపరి కార్యాచరణ విషయంలో టీఎస్పీఎస్సీ ఎలాంటి ప్రకటనలు చేయకపోవడం అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తోంది.

రద్దైన పరీక్షలలో గ్రూప్-1 పరీక్ష ఒక్కటే వచ్చే జూన్ 11న నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మిగతా రద్దైన పరీక్షలతో పాటు వాయిదా పడిన టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల రాత పరీక్షల కొత్త తేదీలను ప్రకటించలేదు. దీంతో అభ్యర్థుల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఏళ్ల తరబడి ఎదురుచూపులు చూశామని పరీక్షల విషయంలో సరైన స్పష్టత రాకుంటే ఇంకెంతకాలం ఎదురు చూడాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం ఓ వైపు సిట్ దర్యాప్తును కొనసాగిస్తునే పరీక్షల విషయంలో షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.



Next Story