బీజేపీ కొత్త చీఫ్ నియామకానికి ముహూర్తం ఫిక్స్.. రేసులో ఆ నలుగురు నేతలు!

by Kema Shiva Kumar |

వచ్చే నెల రెండో వారంలో రాష్ట్ర బీజేపీకి కొత్త సారథిని ప్రకటించేందుకు ఆ పార్టీ అధిష్టానం సిద్ధమవుతున్నట్టు తెలిసింది.

బీజేపీ కొత్త చీఫ్ నియామకానికి ముహూర్తం ఫిక్స్.. రేసులో ఆ నలుగురు నేతలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే నెల రెండో వారంలో రాష్ట్ర బీజేపీకి కొత్త సారథిని ప్రకటించేందుకు ఆ పార్టీ అధిష్టానం సిద్ధమవుతున్నట్టు తెలిసింది. 3 నెలల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో స్టేట్ చీఫ్ ఎంపికపై హైకమాండ్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అయితే, కొత్త అధ్యక్షుడి రేసులో ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్, రఘనందన్‌రావు, డీకే.అరుణ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈనెల 29న కేంద్ర మంత్రి అమిత్‌షా నిజామాబాద్‌కు రానున్నారు. అదే రోజున బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపికపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ రోజు అమిత్ షా పలువురు సీనియర్ లీడర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఒకరిద్దరి పేర్లు ఫైనల్ చేయొచ్చని సమాచారం. ఆ సమయంలోనే ఏపీ కొత్త అధ్యక్షుడి నియామకం సైతం జరుగునుంది.

రిటర్నింగ్ అధికారుల నియామకం

తెలంగాణ, ఏపీ రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ఈ నెలాఖరులోగా నిర్వహించి జులై 1వ తేదీ తర్వాత కొత్త అధ్యక్షులను ప్రకటిస్తారు. తెలంగాణ బీజేపీ ఎన్నికల రిటర్నింగ్​అధికారిగా శోభ కరండ్లాంజే నియమించగా, ఏపీ ఎన్నికల రిటర్నింగ్​అధికారిగా పీసీ మెహన్‌ను నియమించారు. బీజేపీ హైకమాండ్​ఇప్పటికే 14 రాష్ట్రాలకు అధ్యక్షులను ప్రకటించగా ఉత్తరప్రదేశ్, కర్నాటక, ఏపీ, గుజరాత్‌లకు నియమించేందుకు ఆయా రాష్ట్రాల సీనియర్ల అభిప్రాయాలు తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఉత్కంఠలో పార్టీ శ్రేణులు

బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుని ఎంపిక రేపు మాపు అంటూ సాగదీస్తోన్న పార్టీ హైకమాండ్​ఎట్టకేలకు జులై రెండో వారంలో ప్రకటన చేస్తుందనే ప్రచారం ఉండటంతో పార్టీ శ్రేణులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అధ్యక్షుని ఎంపిక ఆలస్యమైందని, త్వరగా ప్రకటిస్తే వచ్చే జూబ్లీహిల్స్​ఉప ఎన్నికతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తాచాటుతామని చెబుతున్నారు.

మూడు రాష్ట్రాలకు ఎన్నికల అధికారు నియామకం

దేశవ్యాప్తంగా బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మరో మూడు రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నిక కోసం ఎలక్షన్ ఆఫీసర్స్‌ను నియమించారు. ఈ మేరకు ప్రకటనను ఇవాళ బీజేపీ జాతీయ రిటర్నింగ్ ఆఫీసర్ డా.కె లక్ష్మణ్ జారీ చేశారు. మహారాష్ట్ర స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్‌గా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, ఉత్తరాఖండ్ స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్‌గా కేంద్ర మంత్రి హర్ష మల్హోత్రా, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ ఆఫీసర్‌గా ఎంపీ రవి శంకర్ ప్రసాద్‌ను నియమించారు.

Next Story