ఆ ఇద్దరు ఎవరు..? పేపర్ లీక్ కేసులో కొత్త అనుమానాలు రేపుతోన్న రేవంత్ రెడ్డి ట్వీట్!

by Disha Web Desk 19 |
ఆ ఇద్దరు ఎవరు..? పేపర్ లీక్ కేసులో కొత్త అనుమానాలు రేపుతోన్న రేవంత్ రెడ్డి ట్వీట్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహరంలో తవ్విన కొద్ది అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. పలు కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తున్న సిట్ శనివారం బోర్డు సభ్యుడు బండి లింగారెడ్డిని విచారించింది. లింగారెడ్డి పీఏ రమేష్ ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు. దీంతో కేసు దర్యాప్తులో భాగంగా లింగారెడ్డిని విచారణకు పిలిచిన సిట్.. దాదాపు నాలుగు గంటల పాటు ప్రశ్నించి స్టేట్ మెంట్ రికార్డు చేసింది. మరోవైపు ఇదే కేసులో టీఎస్ పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్‌ను కూడా ఇవాళ సిట్ ప్రశ్నించింది. ప్రశ్నపత్రాల తయారీ, పేపర్ల చేరిక, పేపర్ల నిర్వహణపై దర్యాప్తు అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది.

ఆ ఇద్దరు ఎవరు?:

ఈ కేసులో లింగారెడ్డిని సిట్ విచారణకు పిలిచిన నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. 'టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ తీగలాగితే ప్రగతి భవన్ డొంక కదిలిందా? విచారణలో 'బావ' .. తెలంగాణ సీఎంవోలో బావమరిది?. మీకు అర్థం అవుతోందా..'పరువు'గల కేటీఆర్ గారూ' అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా బండి లింగారెడ్డి ప్రొపైల్‌కు సంబంధించిన స్క్రీన్ షార్ట్‌ను షేర్ చేశారు. దీంతో రేవంత్ రెడ్డి చెబుతున్న ఆ బావ బావమరిది ఎవరా అనే చర్చ జరుగుతోంది.

Next Story

Most Viewed