కూర‘గాయాలు.. ఎండ దెబ్బకు ధరలు పైపైకి

by Disha Web Desk 9 |
కూర‘గాయాలు.. ఎండ దెబ్బకు ధరలు పైపైకి
X

దిశ ప్రతినిధి, నిర్మల్: వామ్మో... మరీ ఇంత ధరలా..? కూరగాయల మార్కెట్‌కి వెళుతున్న ప్రతి సామాన్యుడి నోట వినిపిస్తున్న మాట ఇదే. భారీ ఎండల కారణంగా కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. కొన్ని కూరగాయలు అయితే దినసరి కూలీలు చేసుకుని బతుకులీడ్చే కుటుంబాలు అసలు కొనే పరిస్థితి లేదు. కూరగాయల ధరలు సీజన్ల‌ని బట్టి రెట్టింపు కావడం సహజం. కానీ ప్రస్తుత మార్కెట్లో కొన్ని కూరగాయల ధరలు ఒకేసారి నాలుగింతలవ్వడం సామాన్యులను కలవరపెడుతోంది. సరిగ్గా నాలుగు రోజుల వ్యవధిలోనే ఈ పరిస్థితి మారిందని వినియోగదారులు, దుకాణాల యజమానులు చెబుతున్నారు.

అల్లం రూ. 240.. పచ్చిమిర్చి రూ. 140...

గత వారం క్రితం దాకా కిలో 80 నుండి 100 రూపాయలు ధర పలికిన అల్లం తాజాగా మార్కెట్ లో రూ.240 కి పెరిగింది. ఈ పెరుగుదలపై సామాన్యుల విషయంలో తీవ్రమైన భారమే. ఇక అన్నింటా వాడే పచ్చి మిర్చి ధర కిలో రూ. 140 కి ఎగబాకింది. ఒకేసారి రెట్టింపు కావడం గమనార్హం. సామాన్యులు నిత్యం వినియోగించే టమాట ధరలు కిలో 60 కి పెరిగింది. ఇక మిగిలిన కూరగాయల ధరలు కూడా భారీగా పెరిగాయి. వంకాయలు రూ.80, బీరకాయలు రూ 100, చిక్కుడుకాయలు రూ 100, బెండకాయలు రూ 80, క్యాబేజీ రూ 80, కాలీఫ్లవర్ రూ 100 కాప్సికం రూ 100 లకు ధరలు చేరాయి. ధరలు అమాంతం పెరిగిపోవడంతో సామాన్యుడి పొయ్యి వెలిగించడం కష్టంగా మారింది.

చికెన్ కిలో రూ 320

మేక, గొర్రె మాంసం కొనలేని సామాన్యులు కాసింత నాన్ వెజ్ కోసం బ్రాయిలర్ చికెన్ కొంటూ ఉంటారు. కానీ చికెన్ ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో 140 నుండి 180 తో లభించిన చికెన్ ఇప్పుడు ఒకేసారి 320 నుండి 340 రూపాయల దాకా పెరిగింది. వినియోగం పెరగడం, ఫంక్షన్ లు ఎక్కువగా జరుగుతుండటం తో అటు కూరగాయలు, ఇటు కోళ్ల ధరలు భారీగా పెరిగిపోయాయి.

ఎండల తీవ్రత వల్లనే...

తీవ్రమైన ఎండలకు కూరగాయలు, చికెన్ ధరలు భారీగా పెరిగడానికి కారణం అయ్యాయని వ్యాపారులు చెబుతున్నారు. స్థానికంగా కూరగాయల దిగుబడులు తగ్గడం ఎక్కువగా దిగుమతి అయ్యే మహా రాష్ట్ర లోను కూరగాయల ఉత్పత్తులు తగ్గడం ధరల పెరుగుదలకు కారణం అని తెలుస్తోంది తీవ్రమైన ఎండల కారణంగా కూరగాయల సాగుపై తీవ్ర ప్రభావం పడింది. మరోవైపు మార్కెట్లో కూరగాయలు భారీ ఎండల మూలంగా ఒక్కరోజులోనే వాడిపోతున్నాయి. మరుసటి రోజు వ్యాపారుల వద్ద మిగిలిపోతున్న కూరగాయలను ఎవరు కొనుగోలు చేయడం లేదు దీంతో కూరగాయల కొరత భారీగా పెరిగింది.

దిగుమతులు తగ్గిపోయాయి

మార్కెట్లో అన్ని రకాల కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. ఇక్కడి రైతులు పండిస్తే మార్కెట్లో కూరగాయల ధరలు అదుపులో ఉంటాయి. భారీ ఎండల కారణంగా రైతుల నుంచి కూరగాయలు రావడం లేదు. మహారాష్ట్ర మదనపల్లె సికింద్రాబాద్ తదితర ప్రాంతాల నుంచి దిగుమతులు కూడా భారీగా తగ్గాయి. దీనివల్లనే ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. - రాజేందర్, కూరగాయల వ్యాపారి

ఇంత ధర ఎప్పుడు చూడలేదు...

కూరగాయల ధరలు భారీగా పెరగడం మాలాంటి సామాన్యులకు భారమే. అల్లం 200 దాటడం ఎప్పుడు చూడలేదు. పచ్చిమిర్చి కిలో 120 నుంచి వంద నలభై దాకా అమ్ముతున్నారు. ఒక్కసారిగా పెరిగిన ధరలతో సామాన్యులకు దిక్కుతోచడం లేదు

- సురేష్, నిర్మల్



Next Story

Most Viewed