కొనలేం.. తినలేం భగ్గుమంటున్న ధరలు

by Disha Web Desk 21 |
కొనలేం.. తినలేం భగ్గుమంటున్న ధరలు
X

దిశ, మెదక్​ ప్రతినిధి: పచ్చి మిర్చి ముట్టుకుంటే ఘాటెక్కుతోంది.. టమాటా ఒక్కసారి ఆకాశం లో ఎక్కి కూర్చుంది.. మేమేం తక్కువా అన్నట్లు అన్ని కూరగాయల ధరలు వాటి వెంటే కొండెక్కి కూర్చున్నాయి.. నెల రోజుల క్రితం ఉన్న ధరలతో పోల్చుకుంటే ప్రస్తుతం డబుల్ అవడంతో సామాన్య ప్రజలు వామ్మో అంటున్నారు.. మార్కెట్ కు ఐదు వందల నోటు తో వెళితే... సగం బస్తా కూడా నిండడం లేదని ప్రజలు వాపోతున్నారు. మిర్చి ధర మార్కెట్​లో రూ.100, బిర్నిస్​ ధరకు రూ.160 కు పెరిగింది. కాకర రూ.50కి చేరింది. టమాట రూ.50 నుంచి 60 మధ్యలో ఉంది. ప్రతి వస్తువు ధర పెరిగి ప్రజలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. స్థానికంగా కూరగాయల సాగు లేకపోవడంతో ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో దిగుబడి వస్తేనే ధరలు అదుపులోకి వస్తాయని వ్యాపారులు చెబుతున్నారు.

మార్కెట్ కు వెళ్లిన సామాన్యులకు కూరగాయల ధరలు షాక్ కు గురి చేస్తున్నాయి.. సాధారణంగా ధరలు ప్రతిసారి కొన్ని మాత్రమే పెరుగుతాయి. కాని ఇటీవల కాలంలో కూరగాయల ధరలను పరిశీలిస్తే అవ్వాక్వాల్సిన పరిస్థితి నెలకొంది.. ప్రతి కూరగాయ ధర రెట్టింపు పెరిగింది. అందులో ప్రధానంగా పచ్చి మిర్చి ధర ప్రస్తుతం మార్కెట్ లో రూ.100 కు విక్రయిస్తున్నారు.. నెల రోజుల క్రితం పచ్చి మిర్చి ధర రూ.40 నుంచి 50 వరకు ధర ఉంది. కాని ఇటీవల కాలంలో పచ్చి మిర్చి ధర ఏకంగా రూ.100 నుంచి రూ.120 వరకు పెరిగింది. ఇక ప్రతి ఇంటా నిత్యం వినియోగించే టమాట రూ 15 నుంచి 20 వరకు ఉంటే ప్రస్తుతం రూ.50 నుంచి 60 వరకు మార్కెట్ లో విక్రయిస్తే మాల్స్ లో రూ.80 వరకు విక్రయిస్తున్నారు.. బిర్నిస్ ధర రూ.160 కి పెరిగింది. చేదుగా ఉండే కాకర రూ.20 నుంచి రూ.30 వరకు ఉండే ధర ఈ సారి రూ.50 కి చేరింది.. వీటితో పాటు ఆలుగడ్డ, బెండకాయ, దొండకాయ, శ్యామగడ్డ తో పాటు అన్ని కూరగాయ ధరలు డబుల్ పెరగడం తో ప్రజలు తల్లడిల్లుతున్నారు. ప్రతి సారి పెరిగే ధరకే అయిన ఈ సారి డబుల్ అవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిత్యావసర ధరలు ఆకాశం లో ఉన్నాయి. ప్రతి వస్తువు ధర పెరిగి సామాన్యులు అందుకోలేని విధంగా ఉంటే ఇక కూరగాయల ధరలు కూడా తామేమీ తక్కువ కాదన్నట్లు పెరిగిపోతున్నాయి. ఉల్లి ధర కొంత పర్వాలేదని ఊపిరి పీల్చుకున్న జనాలకు పెరిగిన కూరగాయల ధరలు చెమటలు పట్టిస్తున్నాయి..

కూరగాయల పంటలు లేకపోవడమే కారణం..?

గ్రామీణ ప్రాంతాల్లో రైతులు సాగు చేసే కూరగాయలు మార్కెట్ వస్తేనే ధరలు తగ్గు ముఖం పడుతాయి.. రైతుల వద్ద కూరగాయలు లేకుంటే ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేస్తారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు కూరగాయల పంటలు లేవు. దీనితో స్థానిక వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేస్తున్నారు. దీనితో రవాణా, ఇతర చార్జీల తో కలిపి విక్రయిస్తారు.. దాని మూలంగానే మార్కెట్ లో కూరగాయల ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. దీనితో పాటు పెళ్ళిల్ల సీజన్ కూడా ఉండడం తో కూరగాయలకు మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని వ్యాపారులు అమాంతం ధరలను పెంచినట్లు ప్రజలు వాపోతున్నారు. గ్రామాల్లో నుంచి రైతులు కూరగాయలు తీసుకు వస్తేనే ధరలు దగ్గే అవకాశం ఉంటుందని పలువురు వాపోతున్నారు. కాని మార్కెట్ లో కూరగాయల ధరలు చూసిన ప్రతి ఒకరు అమ్మో ఇవేం దరలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed