షర్మిల రిమాండ్పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన నాంపల్లి కోర్టు

by Dishafeatures2 |
షర్మిల రిమాండ్పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన నాంపల్లి కోర్టు
X

దిశ, వెబ్ డెస్క్: పోలీసులను కొట్టారనే కేసులో వైఎస్ షర్మిలను జూబ్లీహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారణ చేపట్టిన కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. టీఎస్పీస్సీ పేపర్ లీక్ వ్యవహారాన్ని నిరసిస్తూ లోటస్ పాండ్ లోని తన నివాసం నుంచి వైఎస్ షర్మిల సిట్ ఆఫీస్ కు బయలుదేరగా పోలీసులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే పోలీసుల తీరును నిరసిస్తూ షర్మిల రోడ్డుపై బైఠాయించారు. తనను ఆపడానికి మీరెవరు అంటూ షర్మిల పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఏ పని లేకుంటే గాడిదలు కాసుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పార్టీ అధ్యక్షురాలిగా ప్రజా సమస్యలపై పోరాడే హక్కు తనకుందని, తనను సిట్ ఆఫీస్ కు వెళ్లనీయాలని పోలీసులను కోరారు. అయితే అందుకు పోలీసులు ససేమిరా అనడంతో ఆగ్రహించిన షర్మిల.. అక్కడి నుంచి ముందుకు నడుస్తూ తనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ లేడి కానిస్టేబుల్ పై చేయిచేసుకున్నారు.

అదేంటని ప్రశ్నించిన పోలీస్ అధికారిని కూడా షర్మిల పక్కకు తోశారు. తమ విధులకు ఆటంకం కలిగించేలా షర్మిల వ్యవహరించారని పోలీసులు ఆరోపించారు. ఈ క్రమంలోనే షర్మిలపై 353, 332, 509, 427 సెక్షన్ల కింద జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. గాంధీ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అయితే ఎలాంటి వారెంట్ లేకుండా షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారని షర్మిల తరఫు లాయర్లు వాదించారు. షర్మిలను తాకేందుకు పోలీసులు ప్రయత్నించారని, ఈ క్రమంలోనే ఆత్మ రక్షణ కోసం ఆమె పోలీసులను నెట్టివేసిందని షర్మిల తరఫు లాయర్లు కోర్టుకు విన్నవించారు. కాగా కేసు విచారణ చేపట్టిన కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది.

Next Story

Most Viewed