పకడ్బందీగా ‘పది’ పరీక్షలు.. TSPSC ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో సర్కార్ కీలక నిర్ణయం

by Disha Web Desk 19 |
పకడ్బందీగా ‘పది’ పరీక్షలు.. TSPSC ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో సర్కార్ కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: పదో తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు అలర్టయ్యారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో టెన్త్ ఎగ్జామ్స్‌లో ఎలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడంపై కసరత్తు చేస్తున్నారు. వచ్చే నెల3వ తేదీ నుంచి 13 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్షలకు 4, 94, 616 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2,652 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. హాల్ టికెట్లను ఈనెల 24వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. గతంలో 11 పేపర్లు ఉండగా ఏడాది నుంచి ఆరు పేపర్లకు కుదించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. సీసీ కెమెరాల నిఘాలోనే ప్రశ్న పత్రాలు ఓపెన్ చేయనున్నారు.

మంత్రి సబిత సమీక్ష

పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో బషీర్‌బాగ్‌లోని తన కార్యాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణలో అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా త్వరలో అన్ని జిల్లాల డీఈవోలు, కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఎలాంటి లోటు పాట్లు లేకుండా పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. ఈ సమీక్షలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య సంచాలకులు శ్రీదేవసేన, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఉన్నారు.

ఎగ్జామ్ షెడ్యూల్ ఇదే..

తేదీ సబ్జెక్ట్ సమయం

3 ఏప్రిల్ 2023 ఫస్ట్ లాంగ్వేజ్ ఉ.9:30-12:30

4 ఏప్రిల్ 2023 సెకండ్ లాంగ్వేజ్ ఉ.9:30-12:30

6 ఏప్రిల్ 2023 థర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లిష్) ఉ.9:30-12:30

8 ఏప్రిల్ 2023 గణితం ఉ.9:30-12:30

10 ఏప్రిల్ 2023 సైన్స్(ఫిజికల్/బయాలాజికల్) ఉ.9:30-12:50

11 ఏప్రిల్ 2023 సోషల్ స్టడీస్ ఉ.9:30-12:30

12 ఏప్రిల్ 2023 ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 ఉ.9:30-12:30

13 ఏప్రిల్ 2023 ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 ఉ.9:30-12:30


Next Story

Most Viewed