Smart Ration Card: ఏటీఎం కార్డు సైజులో డిజైన్ సిద్ధం.. ఆ ఫొటో ఉంటుందా? లేదా? అనే దానిపై రాని క్లారిటీ!

by Gantepaka Srikanth |

లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇవి ఏటీఎం కార్డు సైజులో ఉండనున్నాయి. ఒకవైపు సీఎం, మరోవైపు పౌరసరఫరాల శాఖ మంత్రి ఫొటో.. మధ్యలో ప్రభుత్వం లోగో ఉండనున్నది.

Smart Ration Card: ఏటీఎం కార్డు సైజులో డిజైన్ సిద్ధం.. ఆ ఫొటో ఉంటుందా? లేదా? అనే దానిపై రాని క్లారిటీ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇవి ఏటీఎం కార్డు సైజులో ఉండనున్నాయి. ఒకవైపు సీఎం, మరోవైపు పౌరసరఫరాల శాఖ మంత్రి ఫొటో.. మధ్యలో ప్రభుత్వం లోగో ఉండనున్నది. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ లేని జిల్లాల్లో ముందుగా ఈ కార్డుల పంపిణీకి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. కార్డుల తయారీ కోసం షార్ట్ టెండర్ పిలిచే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ముందుగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో లక్ష మందికి వీటిని పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం విడతల వారీగా అందరికీ అందించనున్నారు.

ఇప్పటికే కార్డులు కలిగి ఉన్నవారికి సైతం స్మార్ట్ కార్డులు అందనున్నాయి. ఇందులో కుటుంబ సభ్యుల ఫొటో ఉంచాలా? లేక గృహిణి ఫొటో మాత్రమే ఉంచాలా? అనే అంశంపై సస్పెన్స్ నెలకొన్నది. కుటుంబ సభ్యుల వివరాలు మాత్రమే పెట్టాలని ఒక ప్రతిపాదన సైతం ఉన్నట్టు తెలిసింది. కార్డుకు వెనకభాగంలో చిరునామా, క్యూఆర్​కోడ్‌తో పాటు, రేషన్​దుకాణం నంబర్, ఇతర వివరాలు ఉంటాయి. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేకంగా గడువు ఏమీ ఉండదని, ఇది నిరంతర ప్రక్రియ అని అధికారులు స్పష్టంచేశారు. ఒకసారి దరఖాస్తు చేసుకున్న వారు మరోసారి అప్లయ్ చేయాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు.

మీసేవ ద్వారా 1.3 లక్షల దరఖాస్తులు

రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం మీసేవ ద్వారా ఇప్పటివరకు లక్షా 30 వేల దరఖాస్తులు వచ్చినట్టు పౌరసరఫరాల శాఖ పేర్కొంది.అందులో గ్రేటర్​పరిధిలోనే 65 వేల దరఖాస్తులు ఉన్నట్టు తెలిపింది. మరో లక్షకుపైగా అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నది. కులగణన, ప్రజాపాలన, ప్రజావాణి, మీ సేవ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు సుమారుగా 10.70 లక్షల దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే చాలా దరఖాస్తులను పరిశీలించారు. మిగతావి పూర్తిచేసిన వెంటనే రేషన్​కార్డులు మంజూరు చేయనున్నట్టు సమాచారం.

మార్పులు, చేర్పులకు 26 లక్షల అప్లికేషన్లు..

పాత రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల చేరికలు, చిరునామా మార్పులకు సంబంధించి 26 లక్షల వరకు దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. అందులో సగం వరకు అప్లికేషన్లను పరిశీలించి వచ్చేనెల మొదటి వారంలో మార్పులు, చేర్పుల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. సన్నబియ్యం పంపిణీ చేసేలోగా లక్ష మందికి డిజిటల్​కార్డులు అందిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి ఇటీవలే ప్రకటించారు. రెండు రోజుల క్రితం అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్.. గత ప్రభుత్వం రేషన్​కార్డులు ఇవ్వకుండా విస్మరించిందని, మన ప్రభుత్వం వీలైనంత త్వరగా డిజిటల్​కార్డులు పంపిణీ చేయాలని ఆదేశాలిచ్చారు. దీంతో అధికారులు అందుకు సంబంధించిన కసరత్తు చేస్తున్నారు.

సన్నబియ్యం పంపిణీకి సన్నాహాలు..

ఉగాది నుంచి రేషన్​దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు 5 లక్షల మెట్రిక్​టన్నుల బియ్యం గోదాముల్లో నిల్వ ఉంచామని, సర్కార్​గ్రీన్‌సిగ్నల్​ఇవ్వగానే దుకాణాలకు చేరవేస్తామని పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారి వెల్లడించారు. ఎనిమిది నెలలకు సరిపడా బియ్యం సిద్ధం చేశామని, మరో నాలుగు నెలలకు సంబంధించిన బియ్యాన్ని మిల్లర్ల నుంచి సేకరిస్తున్నట్టు వెల్లడించారు.

Next Story