మహా నగరాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నారు.. మాజీ మంత్రి తలసాని ఫైర్

by Kema Shiva Kumar |

హైదరాబాద్ మహానగరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా విభజిస్తోందని, కనీస శాస్త్రీయ అధ్యయనం లేకుండా గూగుల్ మ్యాప్స్ ఆధారంగా డివిజన్లను మారుస్తున్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా ధ్వజమెత్తారు.

మహా నగరాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నారు.. మాజీ మంత్రి తలసాని ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా విభజిస్తోందని, కనీస శాస్త్రీయ అధ్యయనం లేకుండా గూగుల్ మ్యాప్స్ ఆధారంగా డివిజన్లను మారుస్తున్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు ఘనమైన చరిత్ర ఉందన్న విషయాన్ని ప్రభుత్వం మర్చిపోతోందని అన్నారు. సికింద్రాబాద్ సంస్కృతిని, దాని ఉనికిని నాశనం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఫైర్ అయ్యారు. అడ్డగోలు విభజనను తాము అంగీకరించే ప్రసక్తే లేదని అన్నారు. సికింద్రాబాద్‌కు ప్రత్యేకంగా సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

జనవరి 17న మహా ఆందోళన

అడ్డగోలుగా విడిజన్ల విభజన, ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని తలసాని ప్రకటించారు. ఈ మేరకు జనవరి 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో భారీ ఆందోళన నిర్వహిస్తామని, తమతో కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకుని ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధైర్యం ఉంటే హైదరాబాద్ పేరు మార్చి మర్చాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆయన సవాలు విసిరారు. మహానగర విభజనపై కాంగ్రెస్ నాయకులకు కనీస అవగాహన లేదన్నారు. ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోకుండా 24 నియోజకవర్గాల పరిధిలోని ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో పాలనా సౌలభ్యం కోసం 150 డివిజన్లు చేస్తే, నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నగరాన్ని గందరగోళం చేస్తోందని విమర్శించారు.

ఇక శాసనసభలో స్పీకర్ వ్యవహారశైలిపై కూడా తలసాని అసహనం వ్యక్తం చేశారు. తాము ఎంతోమంది ముఖ్యమంత్రులు, స్పీకర్లను చూశామని, కానీ ప్రతిపక్షాల వైపు కనీసం కన్నెత్తి చూడని స్పీకర్‌ను ఇప్పుడే చూస్తున్నామని కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డి గంటన్నర పాటు బూతు పురాణం మాట్లాడుతున్నా స్పీకర్ అడ్డు చెప్పకపోవడం దారుణని ఆవేదన వ్యక్తం చేశారు. మహానగరలో డివిజన్ల విభజనపై చట్టపరంగా, న్యాయపరంగా పోరాడటంతో పాటు ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.

Next Story