పీఎం-కుసుమ్ రైతులకు అన్యాయం చేయొద్దు: TGPMKFA

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-27 15:06:39  IST  )

పీఎం-కుసుమ్ కాంపోనెంట్-ఏ పథకం కింద ఆమోదించిన టారిఫ్‌ను తగ్గించవద్దని, గతంలో నిర్ణయించిన రూ.3.13 ధరనే కొనసాగించాలని తెలంగాణ పీఎం-కుసుమ్ ఫార్మర్స్ అసోసియేషన్ (టీజీపీఎంకేఎఫ్ఏ) డిమాండ్ చేసింది....

పీఎం-కుసుమ్ రైతులకు అన్యాయం చేయొద్దు: TGPMKFA
X

దిశ, తెలంగాణ బ్యూరో: పీఎం-కుసుమ్ కాంపోనెంట్-ఏ పథకం కింద ఆమోదించిన టారిఫ్‌ను తగ్గించవద్దని, గతంలో నిర్ణయించిన రూ.3.13 ధరనే కొనసాగించాలని తెలంగాణ పీఎం-కుసుమ్ ఫార్మర్స్ అసోసియేషన్ (టీజీపీఎంకేఎఫ్ఏ) డిమాండ్ చేసింది. శనివారం ఖైరతాబాద్‌లోని ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 300 మంది పీఎం-కుసుమ్ రైతులు, పీపీఏ హోల్డర్లు పాల్గొని తమ ఆందోళనను వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సంఘం సలహాదారు సంతోష్ రావు బల్గూరి మాట్లాడుతూ తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) మొదట ఖరారు చేసిన రూ.3.13 టారిఫ్‌ను నమ్ముకుని వందలాది మంది రైతులు బ్యాంకు రుణాలు తీసుకుని ప్రాజెక్టులు పూర్తి చేశారని తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ టారిఫ్‌ను రూ.2.98కు తగ్గించాలని ప్రతిపాదించడం సరికాదన్నారు. కేవలం జీఎస్టీ తగ్గింపును మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ధర తగ్గించడం తగదన్నారు.

రైతులు ఆత్మహత్య చేసుకునాల్సిందే...

జీఎస్టీ తగ్గింపు సాకుతో టారిఫ్ తగ్గించాలని కోరుతూ టీజీఎస్పీడీసీఎల్ అధికారులు ఈఆర్సీ వద్ద పిటిషన్ ఫైల్ చేశారని టీజీపీఎంకేఎఫ్ఏ ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రాజు తెలిపారు. టారిఫ్ తగ్గిస్తే సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకున్న అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సోలార్ మాడ్యూల్స్, స్టీల్, అల్యూమినియం, ట్రాన్స్‌ఫార్మర్లు, కేబుల్స్ ధరలతో పాటు రవాణా, కార్మిక వ్యయం భారీగా పెరిగాయని ఉపాధ్యక్షుడు టీజీపీఎంకేఎఫ్ఏ పి. గంగారెడ్డి గుర్తుచేశారు. ఈ దశలో టారిఫ్ తగ్గిస్తే రైతులు తీవ్ర ఆర్థిక నష్టాల్లో మునిగిపోతారని, ప్రభుత్వ పథకాలపై నమ్మకం కోల్పోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీజీఈఆర్సీ వాస్తవ ప్రాజెక్టు వ్యయాలను సమగ్రంగా పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని, అవసరమైతే టారిఫ్‌ను పెంచాలని విజ్ఞప్తి చేశారు.

Next Story