TG: రూ.37కోట్లతో అభివృద్ధి పనులు.. టెండర్లు పిలిచిన టీజీఐఐసీ

by Gantepaka Srikanth |

రెండు పారిశ్రామిక వాడల్లో వివిధ రకాల అభివృద్ధి పనుల కోసం టీజీఐఐసీ టెండర్లను ఆహ్వానించింది.

TG: రూ.37కోట్లతో అభివృద్ధి పనులు.. టెండర్లు పిలిచిన టీజీఐఐసీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రెండు పారిశ్రామిక వాడల్లో వివిధ రకాల అభివృద్ధి పనుల కోసం టీజీఐఐసీ టెండర్లను ఆహ్వానించింది. పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.37 కోట్లకుపైగా అంచనా వ్యయంతో మూడు పనులకు టెండర్లు పిలిచింది. చీఫ్ ఇంజినీర్-2 కార్యాలయం నుంచి జారీ చేసిన టెండర్ నోటీసు ప్రకారం ఈ పనులు రాష్ట్రంలోని పలు పారిశ్రామిక ప్రాంతాల్లో చేపట్టనున్నారు. మొదటి టెండర్ కింద కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ పరిధిలోని ప్యాంపేట్ గ్రామంలో ఉన్న ఎవర్స్‌టెప్ టెక్స్‌టైల్ అండ్ అపెరల్ కాంప్లెక్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు 132 కేవీ స్థాయిలో విద్యుత్ సరఫరా విస్తరణ పనులు చేపట్టనున్నారు. 26 ఎంవీఏ కమాండ్ డిమాండ్‌కు అనుగుణంగా ఈ ప్రాజెక్టు రూపొందించగా ప్రారంభదశలో 10 ఎంవీఏ లోడ్‌తో విద్యుత్ సరఫరా చేయనున్నారు.

ఈ పనులకు సుమారు రూ.8.04 కోట్ల అంచనా వ్యయంగా నిర్ణయించారు. ఈ టెండర్ బిడ్ డౌన్‌లోడ్ మార్చి 5 మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభమై, బిడ్ సమర్పణకు చివరి తేదీ మార్చి 12 ఉదయం 11 గంటల వరకు ఉంటుంది. అలాగే.. రెండో టెండర్ ద్వారా సుల్తాన్‌పూర్ ఇండస్ట్రియల్ పార్క్ ఆర్సీసీ స్టార్మ్ వాటర్ డ్రైన్ల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. పారిశ్రామిక పార్కులో వర్షపునీటి నిల్వ సమస్యలను నివారించేందుకు ఈ పనులకు టెండర్లు పిలిచారు. రూ.18.08 కోట్ల అంచనా వ్యయంగా నిర్ణయించారు. మూడో టెండర్ కింద ఖమ్మంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ తెలంగాణ డివిజన్‌కు సంబంధించిన బ్రాంచ్ కార్యాలయ భవనాల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనులకు రూ.11.26 కోట్ల అంచనా వ్యయం కేటాయించారు. ఈ టెండర్లకు బిడ్ డౌన్‌లోడ్ ఈ నెల 7 సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమై, బిడ్ సమర్పణకు చివరి తేదీ 23 మధ్యాహ్నం 3 గంటలుగా నిర్ణయించారు. పూర్తి వివరాలు తెలంగాణ ఈ-ప్రొక్యూర్మెంట్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.

Next Story