విద్యార్థుల సర్టిఫికెట్ల నిలుపుదలపై టీజీహెచ్‌ఆర్సీ ఆదేశాలు

by Muthe.Rajitha |   (  Updated:2025-08-25 17:37:28  IST  )

విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను అన్యాయంగా నిలిపివేసిన రెండు వేర్వేరు కేసుల్లో తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్ఆర్సీ) కీలక ఆదేశాలు జారీ చేసింది.

విద్యార్థుల సర్టిఫికెట్ల నిలుపుదలపై టీజీహెచ్‌ఆర్సీ ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను అన్యాయంగా నిలిపివేసిన రెండు వేర్వేరు కేసుల్లో తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్ఆర్సీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బాలానగర్‌లోని గౌతమి డిగ్రీ కాలేజీ, బంజారా హిల్స్‌లోని సుల్తాన్-ఉల్-ఉలూమ్ ఫార్మసీ కాలేజీల యాజమాన్యానికి ఆగస్టు 28న కమిషన్ ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. రెండు కాలేజీల్లో టీజీహెచ్ఆర్సీ ఛైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన ఈ ఆదేశాలు జారీ చేశారు. కమిషన్ విద్యార్థుల సర్టిఫికెట్లను అక్రమంగా నిలిపివేయడం వారి విద్యా, ఉద్యోగ అవకాశాలను అడ్డుకోవడమేనని, ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని కమిషన్ మరోసారి స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి కేసులపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

బాలానగర్‌లోని గౌతమి డిగ్రీ కాలేజీకి సంబంధించిన ఒక కేసులో, ఒక బిబిఎ విద్యార్థి ప్రభుత్వ స్కాలర్‌షిప్ రీయింబర్స్‌మెంట్ పెండింగ్‌లో ఉందనే సాకుతో అతని ఒరిజినల్ సర్టిఫికెట్లు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ ఇవ్వకుండా నిలిపివేసింది. ఈ చర్య రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం విద్యా హక్కును ఉల్లంఘించడమేనని కమిషన్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, కాలేజీ ఛైర్మన్, ప్రిన్సిపాల్‌ను ఈ నెల 28న కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించింది.

బంజారా హిల్స్‌లోని సుల్తాన్-ఉల్-ఉలూమ్ ఫార్మసీ కాలేజీ విషయంలో, విద్యార్థుల సర్టిఫికెట్లను తిరిగి ఇవ్వాలని గతంలో జారీ చేసిన ఆదేశాలను అమలు చేయలేదని 17 మంది విద్యార్థులలో 10 మంది కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. గతంలో ఇచ్చిన ఆదేశాలను కాలేజీ నిర్లక్ష్యం చేయడాన్ని కమిషన్ తీవ్రంగా పరిగణించింది. దీంతో కాలేజీ ఛైర్మన్, ప్రిన్సిపాల్‌ను ఈ నెల 28 న తప్పనిసరిగా హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.

Next Story