మెట్రో రైళ్లపై TGB మెరుపులు.. ఎల్బీనగర్‌లో ‘ఎక్స్‌టీరియర్‌ ర్యాప్’ క్యాంపెయిన్ షురూ

by Kema Shiva Kumar |

తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ (TGB) నగరవాసులకు తమ సేవలను చేరువ చేసేందుకు ఎల్బీనగర్‌ మెట్రో స్టేషన్‌లో ‘మెట్రో ఎక్స్‌టీరియర్‌ ర్యాప్’ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది.

మెట్రో రైళ్లపై TGB మెరుపులు.. ఎల్బీనగర్‌లో ‘ఎక్స్‌టీరియర్‌ ర్యాప్’ క్యాంపెయిన్ షురూ
X

దిశ, తెలంగాణ బ్యూరో: నగరవాసులకు తమ సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ (TGB) సోమవారం ఎల్బీనగర్‌ మెట్రో స్టేషన్‌లో ‘మెట్రో ఎక్స్‌టీరియర్‌ ర్యాప్’ క్యాంపెయిన్‌ను లాంఛనంగా ప్రారంభించింది. ఎస్‌బీఐ జనరల్ మేనేజర్ ప్రకాశ్ చంద్ర బరోర్ ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, టీజీబీ చైర్మన్ కె.ప్రతాపరెడ్డి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. నగరంలో అత్యంత రద్దీ మార్గమైన మియాపూర్ - ఎల్బీనగర్ (రెడ్ లైన్) రూట్‌లో తిరిగే 25 మెట్రో రైళ్లపై టీజీబీ ప్రకటనలను ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ ప్రతాపరెడ్డి మాట్లాడుతూ.. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ వ్యాపారం రూ.81,153 కోట్లకు, నికర లాభం రూ.1,283 కోట్లకు చేరిందని వెల్లడించారు. 2028 నాటికి రూ.లక్ష కోట్ల వ్యాపారమే లక్ష్యంగా బ్యాంక్ ముందుకెళ్తోందన్నారు.

‘వన్ స్టేట్ వన్ ఆర్‌ఆర్‌బీ’ విధానంలో ఏపీజీవీబీకి చెందిన తెలంగాణ బ్రాంచ్‌లు సైతం టీజీబీలో విలీనమవ్వడంతో.. రాష్ట్రంలో 939 శాఖలతో ఎస్‌బీఐ తర్వాత రెండో అతిపెద్ద నెట్‌వర్క్‌ కలిగిన బ్యాంక్‌గా టీజీబీ అవతరించిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం కస్టమర్లకు డిపాజిట్లపై 8 శాతం వరకు రాబడి అందిస్తున్నామని, ఎంఎస్‌ఎంఈలకు పూచీకత్తు లేకుండా రూ.2 కోట్ల వరకు రుణాలు మంజూరు చేస్తున్నామని అధికారులు వివరించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇవ్వడంలో టీజీబీ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story