TG Govt.: డ్రగ్స్, బెట్టింగ్ యాప్స్‌పై సర్కార్ ఫోకస్.. రూ.కోట్లలో లావాదేవీలు!

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-03 01:46:22  IST  )

డ్రగ్స్, బెట్టింగ్ యాప్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరించనుంది.

TG Govt.: డ్రగ్స్, బెట్టింగ్ యాప్స్‌పై సర్కార్ ఫోకస్.. రూ.కోట్లలో లావాదేవీలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: డ్రగ్స్, బెట్టింగ్ యాప్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరించనుంది. యువతే టార్గెట్‌గా జరుగుతున్న నిషేధిత డ్రగ్స్, బెట్టింగ్ యాప్స్ వ్యవహారాలపై ఉక్కుపాదం మోపాలని సర్కారు యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేసింది. ఇప్పటికే బెట్టింగ్ యాప్ వ్యవహరంలో ప్రభుత్వం దుకుడుగా ముందుకెళ్తోంది. అయితే, డ్రగ్స్, బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో రూ.కోట్లలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో సర్కారు స్పందించింది. అమాయకులైన ప్రజలను టార్గెట్ చేస్తూ.. యువతను పెడదోవ పట్టిస్తున్న బెట్టింగ్ యాప్స్, దానిని నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విజిలెన్స్ ఆఫీసర్లకు పూర్తి స్థాయిలో విచారణ అధికారాలు ఇచ్చినట్టుగా తెలుస్తున్నది. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన సినిమా, యూట్యూబ్ సెలబ్రిటీలను విజిలెన్స్ అధికారులు విచారించనున్నారు. విజిలెన్స్ అధికారుల ఒక వైపు సిట్ అధికారులు మరోవైపు బెట్టింగ్ యాప్స్‌పై విచారణ చేపట్టనున్నారు.

బెట్టింగ్ యాప్ నిర్వాహకులపై కేసులు

ప్రభుత్వ ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగినట్టు తెలుస్తున్నది. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు, ప్రమోషన్ చేసిన వారిపై నిఘా ఉంచారు. లావాదేవీలకు సంబంధించిన గైడ్‌లెన్స్‌పై ఎంక్వయిరీ చేపట్టారు. ఆర్బీఐ నిబంధనల మేరకే ట్రాన్సాక్షన్స్ జరిగాయా? అనే అంశంపై ప్రధానంగా దృష్టి సారించారు. బెట్టింగ్ యాప్‌లకు సంబంధించి రూ.కోట్లలో లావాదేవీలు జరుగుతునట్టు ఆరోపణలతో 19 బెట్టింగ్ యాప్ పేర్లను కేసు‌లో చేర్చారు. జంగ్లీ రమ్మీ డాట్‌కామ్, ఏ23, యోలో 247 డాట్‌కామ్, ఫెయిర్న్లో, జీత్‌విన్, వీఎల్‌బుక్, తాజ్77, వీవీబీబాక్, ధని బుక్365, మామ 247, తెలుగు 365, యెస్ 365, జై365, వీవీబుక్, ఓకేవిన్, జెట్ఎక్స్, పరిమ్యాచ్, తాజ్777 బుక్, ఆంధ్రా365 తదితర యాప్‌లపై విజిలెన్స్ విచారణ చేపట్టనుంది. ఇప్పటికే యాప్ నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ఈ యాప్‌లకు సంబంధించిన ఆన్‌లైన్ పేమెంట్ చేసే సంస్థలపైనా ఎంక్వయిరీ చేయనున్నారు.

సీఐడీ ఛీప్ పర్యవేక్షణలో సిట్

సీఐడీ చీఫ్‌ పర్యవేక్షణలో సిట్‌ పనిచేసేలా డీజీపీ జితేందర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సిట్‌ తన అవసరాల మేరకు ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ), న్యాయ, ఫోరెన్సిక్‌ నిపుణులు, ఇతర విభాగాల నుంచి సహాయ సహకారాలు పొందేలా ఉత్తర్వుల్లో వెసులుబాటు కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కేసులను సిట్‌ విచారించనుంది. ప్రస్తుతం అమలవుతున్న చట్టాలను నిక్కచ్చిగా అమలు చేయడం, బెట్టింగ్‌ యాప్‌లను నిర్మూలించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం జరిపి, పలు సూచనలతో ప్రభుత్వానికి 3 నెలల్లో సమగ్ర నివేదికను అందజేయనుంది.

నిందితులు, యాప్ నిర్వాహకుల ట్రాన్సాక్షన్స్‌ పరిశీలన

బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసిన సినీ యాక్టర్స్, యూట్యూబ్ సెలబ్రిటీలను విజిలెన్స్ ఆఫీసర్లు విచారించనున్నారు. పంజాగుట్ట, మియాపూర్ పోలీస్‌ స్టేషన్లలో 2 కేసులు నమోదవగా, మొత్తంగా 25 మంది ప్రముఖ సినీ నటులు, యూట్యూబర్లను నిందితులుగా చేర్చారు. ప్రముఖ నటులు రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, విజయ్‌ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, యాంకర్ శ్యామల‌పై మియాపూర్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. యాంకర్ విష్ణుప్రియ, నటి రితూ చౌదరి, యూట్యూబర్లు హర్షసాయి, ఇమ్రాన్‌లపై కూడా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే కొందరిని పోలీసులు విచారించారు. విజిలెన్స్ అధికారులు మరోసారి విచారించనున్నారు. నిందితులుగా పేర్కొన్న వారికి బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు మధ్య అగ్రిమెంట్లు, లావాదేవీలను పరిశీలించనున్నారు. ట్రాన్సాక్షన్స్ ఏ మేరకు జరిగాయనే దానిపై సమగ్ర దర్యాప్తు చేపట్టనున్నారు. పంజాగుట్ట పీఎస్‌లో యాంకర్ విష్ణుప్రియ, రితూ చౌదరిని విచారించారు. మళ్లీ విచారణకు రావాలని కోరగా, వారు హైకోర్టును ఆశ్రయించారు. తమపై నమోదైన కేసులకు కోట్టివేయాలని, ముందుస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, న్యాయస్థానం పిటిషన్ కొట్టివేస్తూ ఎంక్వయిరీకి హాజరు కావాల్సిందేనని ఆదేశాలిచ్చింది. ఆధారాలు లేకపోయినా కేసులు పెడుతున్నారని, తనపై నమోదయిన కేసులను వెంటనే కొట్టివేయాలని హర్షసాయి బుధవారం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు గురువారం విచారించనుంది.

Next Story