Delhi Liquor Scam : లిక్కర్ స్కామ్‌లో అప్రూవర్‌గా అరోరా.. టీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ టెన్షన్!

by Dishanational2 |
Delhi Liquor Scam : లిక్కర్ స్కామ్‌లో అప్రూవర్‌గా అరోరా.. టీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ టెన్షన్!
X


కవితకు అరోరా గండం

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సన్నిహితుడు దినేష్ అరోరా అప్రూవర్ గా మారాడు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న అరోరాను సాక్షిగా పరిగణించాలన్న సీబీఐ రిక్వెస్ట్ ను ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టు ఓకే చెప్పింది. మద్యం పాలసీ రూపకల్పనలో ముడుపులకు మీడియేషన్ చేసినట్లు దినేష్ పై ఆరోపణలున్నాయి. ఇప్పుడు అతను అప్రూవర్ గా మారడంతో దర్యాప్తులో కీలక అంశాలు వెలుగుచూసే అవకాశాలున్నాయి. ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో సీఎం కూతురు కవిత హస్తముందని బీజేపీ ఆరోపిస్తుండగా, తెలంగాణలోనూ ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. కాగా, తెలంగాణకు చెందిన వేర్వేరు బ్యాంకు ఖాతాల నుంచి ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు అనుమానించిన సీబీఐ, మనీ లాండరింగ్ కోణం నుంచి కేసును ఈడీకి అప్పగించింది.

దిశ, తెలంగాణ బ్యూరో :అప్రూవర్‌గా మారడానికి సీబీఐ నుంచి ఒత్తిళ్లు, బెదిరింపులు ఉన్నాయా అంటూ జడ్జి నాగ్‌పాల్ దినేష్ అరోరాను ప్రశ్నించారు. స్వచ్ఛందంగానే వాస్తవాలను వెల్లడించడానికి మానసికంగా సిద్ధమయ్యానని, తనపైన ఎలాంటి ఒత్తిళ్లు లేవని ఆయన కోర్టుకు స్పష్టం చేశారు. దీంతో సీబీఐ రిక్వెస్ట్, అప్రూవర్‌గా మారాలన్న దినేష్ అరోరా విజ్ఞప్తిని స్పెషల్ కోర్టు అనుమతించింది.

స్టేట్ మెంట్స్ రికార్డ్..

అప్రూవర్‌గా మారడానికి సిద్ధమైన దినేష్ అరోరా నుంచి జడ్జి నాగ్‌పాల్ సమక్షంలో ఇప్పటికే స్టేట్‌మెంట్ రికార్డు చేసినట్లు సీబీఐ వర్గాల సమాచారం. లిక్కర్ స్కామ్‌లో ఎవరెవరి పాత్ర ఏ మేరకు ఉన్నది, ఎక్కడి నుండి ఆర్థిక లావాదేవీలు జరిగాయి, ముడుపులు ఎవరికి అందాయి, ఏ అవసరం కోసం చేతులు మారాయి తదితరాలన్నింటిపై దినేష్ అరోరా వెల్లడి చేసే అంశాలు దర్యాప్తులో కీలకం కానున్నాయి. తదుపరి దర్యాప్తు ఏ రూపంలో ఎక్కడి చేరుతుందనేది ఆసక్తికరంగా మారింది. కాగా, అరోరా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సన్నిహితుడు. కావడంతో ఆయనకు చిక్కులు తప్పేలా లేవు.

మధ్యవర్తిగా..

లిక్కర్ స్కామ్‌లో అరోరా వేర్వేరు మార్గాల నుంచి ముడుపులు తెప్పించడానికి, అందజేయడానికి మధ్యవర్తిగా వ్యవహరించాడని సీబీఐ అభియోగం. అయితే అరోరా దీంట్లో ఎలాంటి లబ్ధి పొందనప్పటికీ సిసోడియాకు సన్నిహితంగా ఉంటూ ఈ స్కామ్‌లో పాలుపంచుకున్నాడని సీబీఐ పేర్కొన్నది. అరోరాకు చెందిన రాధా ఇండస్ట్రీస్‌ బ్యాంకు ఖాతాకు ఇండో స్పిరిట్స్ (మద్యం తయారీ కంపెనీ) ఎండీగా ఉన్న సమీర్ మహేంద్రు కోటి రూపాయలను పంపారన్నది దర్యాప్తులో వెల్లడైంది. సమీర్ మహేంద్రు నుంచి సుమారు నాలుగు కోట్ల రూపాయలను ఈ కేసులో నిందితుడిగా ఉన్న విజయ్ నాయర్ తరఫున అర్జున్ పాండే తీసుకున్నారని, దీన్ని అరుణ్ రామచంద్రన్ పిళ్ళై చేర్చాల్సిన చోటికి చేర్చి కమిషన్ రూపంలో లబ్ధి పొందారన్నది సీబీఐ అభియోగం. మనీష్ సిసోడియా కనుసన్నల్లో మద్యం పాలసీ రూపకల్పన మొదలు మద్యం తయారీ కంపెనీలకు, లైసెన్సు హోల్డర్లకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారని, దీనికి ప్రతిఫలంగా ముడుపులు అందుకున్నారన్నది సీబీఐ ఆరోపణ. కాగా, అరోరా ఇప్పుడు ఏయే అంశాలను వెల్లడిస్తారనేది కీలకంగా మారింది.

తెలంగాణలో దర్యాప్తు ముమ్మరం!

సీఎం కేసీఆర్ కూతురు కవిత ఎక్సయిజ్ పాలసీ రూపకల్పన సమయంలోనే కొద్దిమందికి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని బీజేపీ ఎంపీలు ఇప్పటికే ఆరోపించారు. ప్రాథమిక దర్యాప్తు తర్వాత సీబీఐ సైతం హైదరాబాద్‌లో సోదాలు చేసింది. మనీలాండరింగ్ జరిగిందన్న అనుమానంతో ఈడీ బృందాలు కూడా విస్తృతంగా సోదాలు చేశాయి. పలువురిని అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఇప్పుడు దినేష్ అరోరా ఈ మొత్తం వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఏ స్థాయిలో ఉన్నదో, ఏ రూపంలో ఉన్నదో వెల్లడించిన తర్వాత తదుపరి దర్యాప్తునకు తెలంగాణ హాట్ ప్లేస్‌గా మారుతుందనే లీకులు ఢిల్లీ నుంచి వెలువడుతున్నాయి.

Read more:

1.ఎన్‌ఫోర్స్ మెంట్ చేతికి కీలక ఆధారాలు?.. అందులో తెలంగాణ నేతల లిస్ట్


Next Story

Most Viewed