ఎన్టీపీసీలో ఉద్రిక్తత.. కార్మిక జేఏసీ నేతలపై లాఠీ చార్జ్

by Disha Web Desk 2 |
ఎన్టీపీసీలో ఉద్రిక్తత.. కార్మిక జేఏసీ నేతలపై లాఠీ చార్జ్
X

దిశ, గోదావరిఖని: రామగుండం ఎన్టీపీసీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్మిక జేఏసీ నాయకులు చేపట్టిన ధర్నా రణరంగంగా మారింది. గత రెండేళ్ల క్రితం యాజమాన్యం ఒప్పుకున్న డిమాండ్లను వెంటనే అమలు చేయాలని సోమవారం కార్మికులు, కార్మిక నేతల జేఏసీ ఎన్టీపీసీ గేటు ఎదుట ధర్నా చేపట్టారు. యాజమాన్యం ఎంతకీ స్పందించకపోవడంతో ఎన్టీపీసీ హెచ్ఆర్ అధికారులతో మాట్లాడుతామని కార్మికులు గేటువైపు కదలడంతో అక్కడే ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. వారిని నిలువరించే ప్రయత్నంలో వాగ్వాదం జరిగింది. పరిస్థితిని అదుపుచేసేందుకు సీఐఎస్ఎఫ్ సిబ్బంది కార్మికులపై లాఠీచార్జ్ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన కార్మికులు, నేతలు సిబ్బందిపై రాళ్లు రువ్వారు. దీంతో ధర్నా కాస్త రణరంగంగా మారింది. ఈ క్రమంలో కొంతమంది కార్మికులకు తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రామగుండం సీఐ కణతల లక్ష్మీనారాయణ ఘటనా స్థలానికి చేరుకొని గొడవ సద్దుమణికే ప్రయత్నం చేశారు.

Next Story

Most Viewed