రాజ్ భవన్‌ వద్ద ఉద్రిక్తత.. మేయర్ విజయలక్ష్మి అరెస్ట్

by Disha Web Desk 2 |
రాజ్ భవన్‌ వద్ద ఉద్రిక్తత.. మేయర్ విజయలక్ష్మి అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ రాజ్‌భవన్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ను కలిసేందుకు మేయర్ గద్వాల విజయ్‌లక్ష్మి, ఎమ్మెల్యే గొంగిడి సునీత, బీఆర్ఎస్ మహిళా కార్పోరేటర్లు భారీ ర్యాలీతో రాజ్‌భవన్ చేరుకుంది. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసేందుకు తమిళిసైని కలవాలని అనుకున్నారు. అయితే ఉదయం నుంచి గవర్నర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నా ఖరారు కాకపోవడంతో వారిని రాజ్‌భవన్‌ వర్గాలు లోనికి అనుమతించలేదు. దీంతో వారు అక్కడే ఆందోళనకు దిగారు. దీంతో, రాజ్‌భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులతో మేయర్ వాగ్వాదానికి దిగారు. రాజ్‌భవన్ గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మేయర్‌, ఎమ్మెల్యే గొంగిడి సునీత, బీఆర్ఎస్ కార్పొరేటర్లను పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ మీడియాతో మాట్లాడుతూ.. కవితపై బండిసంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా మహిళా కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగినట్లు విజయలక్ష్మి తెలిపారు. బండి సంజయ్‌ వ్యాఖ్యలపై గవర్నర్‌‌ను కలిసి వినతిపత్రం ఇవ్వాలని తామంతా రాజ్‌భవన్‌కు వచ్చినట్లు ఆమె వెల్లడించారు. వెంటనే బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed