తుగ్లక్ పాలనలో తెలంగాణ?.. ప్రభుత్వంపై తలసాని తీవ్ర విమర్శలు

by Ramesh Naini |

రాష్ట్రంలో తుగ్లక్ పరిపాలన నడుస్తున్నదని.. రేవంత్‌రెడ్డికి పరిపాలన చేత కాదని.. అన్ని వర్గాల వారు ప్రభుత్వంపై కోపంతో ఉన్నారని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ అన్నారు.

తుగ్లక్ పాలనలో తెలంగాణ?.. ప్రభుత్వంపై తలసాని తీవ్ర విమర్శలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో తుగ్లక్ పరిపాలన నడుస్తున్నదని.. రేవంత్‌రెడ్డికి పరిపాలన చేత కాదని.. అన్ని వర్గాల వారు ప్రభుత్వంపై కోపంతో ఉన్నారని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి అలా చేస్తుంటే తెలంగాణలో ఉండే నిజమైన కాంగ్రెస్ నాయకులకు సోయి లేదా అని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం కేసు హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదన్నారు. మేధా పర్వతం లాంటి కేసీఆర్‌పై ఉమ్మేస్తే తిరిగి కాంగ్రెస్ నాయకులపైనే పడిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజానీకాన్ని ఒక తాటిపైకి తెచ్చి తెలంగాణ సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. రైతులు సంతోషంగా ఉండాలని ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మించారన్నారు. సుంకిశాల వాల్, పెద్ద వాగు, వట్టెం మునిగిపోయిందని.. ఎస్ఎల్‌బీసీ కుంగిపోయి 8 మంది చనిపోయారని.. దీనిపై ఎందుకు విచారణ చేయలేదని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక బ్యారేజ్ మేడిగడ్డ, అందులో రెండు పిల్లర్లు మాత్రమే కుంగిపోయాయని తెలిపారు.

8 బీ, 8సీ ద్వారా నోటీసులు ఇవ్వకుండా కాళేశ్వరం కేసు విషయంలో విచారణ చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిందని.. రెండేళ్లకు పైగా అవుతున్నా హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులకు టెంట్ సామాన్లు ఇవ్వరాదని నోటీసులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని.. దీనిపై రాష్ట్ర డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగిపోతే రాహుల్ గాంధీ, రేవంత్‌ రెడ్డి ఇద్దరు కలిసి లక్ష కోట్ల అవినీతి అంటూ తమపై దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. ఢిల్లీ వెళ్లిన రేవంత్‌ రెడ్డి ఎన్డీయే కూటమి నేతలతో బ్రేక్ ఫాస్ట్ చేశారని అన్నారు. కాళేశ్వరం కేసు విషయంలో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పరిపాలన చేయాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్యే ముఠాగోపాల్, బీఆర్ఎస్ ఖైరతాబాద్ ఇన్‌చార్జ్ మన్నె గోవర్ధన్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కె.కిశోర్‌గౌడ్ పాల్గొన్నారు.

Next Story