అనుమతి లేకుండానే జేబీ ఇన్ఫ్రా 'రియల్' వ్యాపారం.. బీఆర్ఎస్ నేత కీలక భాగస్వామి!

by Disha Web Desk 2 |
అనుమతి లేకుండానే జేబీ ఇన్ఫ్రా రియల్ వ్యాపారం.. బీఆర్ఎస్ నేత కీలక భాగస్వామి!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రియల్ ఎస్టేట్ అక్రమాలకు వరంగా మారింది. వ్యాపార దిగ్గజాలు కూడా అందినంత ముందే వసూలు చేయాలని ప్రయత్నిస్తున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన కంపెనీలు కూడా ఈ సరసన చేరాయి. మంత్రి కేటీఆర్ ప్రధాన అనుచరుడిగా పేరున్న మనోహర్ రెడ్డికి సంబంధించిన జేబీ ఇన్ ఫ్రా గ్రూప్ అనే సంస్థ కూడా ప్రీ లాంచ్ లోనే ప్లాట్లు అమ్మేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇబ్రహీంపట్నంలో 700 ఎకరాలు, చౌటుప్పల్‌లో 1000 ఎకరాల్లో లే అవుట్లు చేసి అమ్మేశాం.. అదే క్రమంలో ప్రస్తుతం మోమిన్ పేటలోనూ 300 ఎకరాల్లో ప్లాటింగ్ చేస్తున్నాం. ప్రీలాంచ్ ఆఫర్లను ప్రకటిస్తున్నాం. త్వరపడండి. మరికొద్ది రోజుల్లోనే ధరలు పెరుగుతాయంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రెండు వారాల ప్రచారంలోనే 100 ప్లాట్లు అమ్మేసినట్లు జేబీ ఇన్ఫ్రా సంస్థ ఉద్యోగులు చెప్తున్నారు.

పేరు, ప్రఖ్యాతులు కలిగిన జేబీ ఇన్ ఫ్రా వంటి రియల్ ఎస్టేట్ సంస్థ కూడా డీటీసీపీ, రెరా నుంచి అనుమతులు పొందకుండానే మార్కెటింగ్ చేస్తుండడం విస్మయానికి గురి చేస్తున్నది. ప్రభుత్వ అండదండలు ఉండడంతో ఎలా అమ్మకాలు సాగించినా చెల్లుబాటు అవుతుందన్న భరోసాతో ఉన్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ, దాని పరిసరాల్లోనే చెరువులు, కుంటలు, కాల్వలు మాయం చేశారన్న ఆరోపణలు జేబీ ఇన్ఫ్రాపై ఉన్నాయి. తాజాగా వెంచర్ పక్కనే ఉన్న గుట్టలను కూడా ఎలాంటి అనుమతులు లేకుండా కొట్టేస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఇప్పుడేమో సంగారెడ్డి జిల్లా మోమిన్ పేటలో ప్రీలాంచ్ ఆఫర్లతో ప్రచారం మొదలు పెట్టారు.

దానికి కూడా సినీ నటుడు నాగబాబు ప్రకటనల్లో కనిపిస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. అనుమతులు లేని ప్రాజెక్టుల్లో ప్లాట్లు కొనుగోలు చేయమని ఆయనెట్లా సూచిస్తున్నారో అర్ధం కావడం లేదని రియల్ ఎస్టేట్ వర్గాలు అంటున్నాయి. ఓ వైపు సాహితీ, జయ, ఫార్చూన్ 99 హోమ్స్, ప్రెస్టేజ్ వంటి కంపెనీలు వివిధ రూపాల్లో ప్రీలాంచ్ మోసాలకు పాల్పడ్డారంటూ ఫిర్యాదులు అందాయి. కొన్నింటిపై కేసులు నమోదై విచారణ ఎదుర్కొంటున్నాయి. ఇంకొన్ని సంస్థలకు నోటీసులు జారీ చేస్తామని రెరా ప్రకటించింది. ఇన్ని పరిణామాల మధ్య జేబీ ఇన్ఫ్రా వంటి సంస్థ కూడా ముందస్తు అమ్మకాలకు తెర తీయడం రియల్ ఎస్టేట్ మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది.

ప్రాజెక్టు బూచీ

రూ.50 వేల కోట్ల పెట్టుబడితో తెలంగాణ మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నాం. దీంతో 4 లక్షల మందికి ఉద్యోగావకాశాలు ఉన్నాయి. రానున్న ఐదేండ్లల్లోనే ఇది పూర్తవుతుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. దాని పక్కనే లే అవుట్. మోమిన్ పేటలో ఏకంగా 300 ఎకరాల్లో జేబీస్ ప్రైడ్ పేరిట వెంఛర్ ఏర్పాటు చేస్తున్నాం.. ఇంకా అనుమతులు రాలేదు. డీటీసీపీ అప్రూవల్ పొందలేదు. రెరాకి దరఖాస్తు చేసుకోలేదు. ఇబ్రహింపట్నం దగ్గర 700 ఎకరాల్లో డీటీసీపీ, రెరా అనుమతులతో లే అవుట్ చేసి అమ్మేశాం. ఇప్పుడు చౌటుప్పల్ ఏరియాలో 1000 ఎకరాల్లో ప్లాట్లు అమ్మేశాం.

ఇప్పుడు తెలంగాణ మొబిలిటీ వ్యాలీ పక్కనే మోమిన్ పేట నుంచి తాండూరు 100 ఫీట్ల రహదారిలో 300 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీని ఏర్పాటు చేస్తున్నాం. అంటూ మోమిన్ పేట లేఅవుట్ ని మార్కెట్లో పెట్టారు. ప్రీలాంచ్ ఆఫర్ ప్రచారంలో సినీ నటుడు నాగబాబు కూడా తోడ్పాటునందిస్తున్నారు. ఆయన ఫోటోలతో కూడిన ప్రచారం సోషల్ మీడియా, వాట్సాప్ లో జోరుగా చేస్తున్నారు. జేబీ ఇన్ఫ్రా డిప్యూటీ జనరల్ మేనేజర్ ఠాకూర్ శ్యాంసింగ్ చెప్పిన వివరాల ప్రకారం రెండు వారాల్లోనే 100 ప్లాట్లు అమ్మేశామంటున్నారు. ఈ మేరకు లే అవుట్ లో ఏయే ప్లాట్లు బుక్ చేశారో మార్క్ చేసిన కాపీని కూడా కస్టమర్లకు అందిస్తుండడం విశేషం. బిజినెస్‌ ఏషియా ఔట్ లుక్ 2022లో తమ వెంచర్ కి ఆరో స్థానం లభించింది. ఆ మేగజైన్ లో వచ్చిన కథనాన్ని ప్రచారంలో వినియోగిస్తున్నారు.

ధరలు ఇవే

నార్త్ ఈస్ట్ 400 గజాల ప్లాట్: రూ.32 లక్షలు

ఈస్ట్ ఫేస్ 300 గజాల ప్లాట్: రూ.23 లక్షలు

ఈస్ట్ ఫేజ్ 220 గజాల ప్లాట్: రూ.17 లక్షలు

వెస్ట్ ఫేజ్ 220 గజాల ప్లాట్: రూ.16.50 లక్షలు

– ప్రీ లాంచ్ కింద గజం ధర రూ.7499 మాత్రమే.

జేబీ ఇన్ఫ్రా జీఎం కిరణ్​రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బేసిక్ ప్రైస్ గజం రూ.7499, ఈస్ట్ ఫేజ్ రూ.7799, నార్త్ ఈస్ట్ రూ.7999, 80 అడుగుల రోడ్డుకైతే రూ.8300లుగా పేర్కొన్నారు. సదాశివాపేట, శంకర్ పల్లి, ముత్తంగి ఓఆర్ఆర్, కొల్లూరు ఓఆర్ఆర్, ఇక్ఫాయ్ బిజినెస్ స్కూల్, ఐఐటీ హైదరాబాద్​, ఎమ్మార్ ఎఫ్ ప్లాంట్, మోకిళ్ల, మొబిలిటీ వ్యాలీకి మధ్యలో జేబీ ఇన్​ఫ్రా వెంచర్ ఉందన్నారు. ఫేజ్ 1 లో 51.38 ఎకరాలు, ఫేజ్ 2లో 64 ఎకరాలు, ఫేజ్ 3లో 44 ఎకరాలు, ఫేజ్ 4లో 52 ఎకరాలుగా పేర్కొన్నారు.

అడ్వాన్స్ బుకింగ్స్

ఇబ్రహీంపట్నం, చౌటుప్పల్ లే అవుట్ల అభివృద్ధి నమూనాను చూపిస్తూ మోమిన్ పేటలోని 300 ఎకరాలను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐతే కనీసం భూ సేకరణ కూడా పూర్తి కాలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంకా కంపెనీ పేరిట మొత్తం ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాలేదు. డీటీసీపీకి, రెరాకి దరఖాస్తు కూడా చేసుకోలేదు. కానీ జేబీ ఇన్ఫ్రా జీఎం కిరణ్​రెడ్డి మాత్రం వచ్చే నెలలో అనుమతులు వచ్చేస్తాయంటున్నారు. ఇప్పుడు అడ్వాన్స్ ప్లాట్లు బుక్ చేస్తున్నాం. బుకింగ్ సమయంలో రూ.2 లక్షలు విలువైన చెక్కులు తీసుకుంటున్నాం. క్యాష్ ఇచ్చినా తీసుకుంటాం. మార్చి మొదటి వారం తేదీలతో చెక్కులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే 25 వేల గజాల విస్తీర్ణంతో కూడిన ప్లాట్లు బుక్ అయ్యాయి. ప్రస్తుతం లే అవుట్ విస్తీర్ణం 1.62 గజాలుగా చెప్పారు. మొదటైతే 56 ఎకరాల్లో వెంచర్ చేస్తున్నామన్నారు. మొత్తం ప్రాజెక్టు మాత్రం 300 ఎకరాలుగా ఖరారు చేసినట్లు వివరించారు.



Next Story

Most Viewed