CM Revanth Reddy: ఇన్నోవేషన్స్, స్టార్టప్ లకు తెలంగాణ సరైన వేదిక: సీఎం రేవంత్ రెడ్డి

by Prasad Jukanti |

'ఇన్నోవేటింగ్ ఫర్ భారత్ -ది బయోడిజైన్' బ్లూ ప్రింట్ ను సీఎం ఆవిష్కరించారు.

CM Revanth Reddy: ఇన్నోవేషన్స్, స్టార్టప్ లకు తెలంగాణ సరైన వేదిక:  సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్ గా ఎదిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. తయారీ రంగం నుంచి ఆవిష్కరణల‌కు కేంద్రంగా తెలంగాణ‌ను మారుస్తున్నామని చెప్పారు. ఇవాళ హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ లో వైద్యపరికరాల తయారీలో స్వయం ప్రతిపత్తే లక్ష్యంగా జరుగుతున్న బయోడిజైన్ ఇన్నోవేషన్ సమ్మిట్-2025 (BioDesign Innovation Summit 2025) లో పాల్గొన్న సీఎం.. ఈ సందర్భంగా 'ఇన్నోవేటింగ్ ఫర్ భారత్ -ది బయోడిజైన్' బ్లూ ప్రింట్ ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు కనిపిస్తున్నాయని ప‌న్నులు, యుద్ధాలు, వాణిజ్యపరమైన అడ్డంకులు ఎదురవుతున్నాయన్నారు. ఈ స‌మ‌యంలో ఆవిష్కరణలు చేయడానికి స్టార్టప్ లు ప్రారంభించడానికి స‌రైన వేదిక తెలంగాణ‌ అని చెప్పారు. డేటా గోప్యతను పాటిస్తూనే ఇక్కడి ప్రజల వైద్య సహాయం కోసం అవసరమైన పరిశోధనలు నిర్వహించేలా మెడికల్ డేటాను ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. స్కిల్ యూనివర్సిటీ, కార్పొరేషన్లు, విద్యా సంస్థలు, రీసెర్చ్ సెంటర్స్ తో అనుసంధానం చేస్తామని చెప్పారు.

మా పూర్తి మద్దతు:

మా ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 (Telangana Rising 2047) అనే ప్రయాణాన్ని ప్రారంభించిందని సీఎం చెప్పారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ అవతరించబోతున్నదని అన్నారు. దేశం 100 సంవత్సరాల స్వాతంత్ర్య ఉత్సవాలు జరుపుకునే 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామన్నారు. తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను సాధించడంలో వైద్య పరికరాలు, మెడ్‌టెక్ కీలకమైనవని.. ఫార్మా, బయోటెక్, లైఫ్ సైన్సెస్, మెడ్‌టెక్ వంటివి హైద‌రాబాద్ లో అత్యంత కీల‌క‌మైన‌వని చెప్పారు. సుల్తాన్ పూర్ లో 302 ఎకరాల్లో దేశంలోనే పెద్ద మెడికల్ డివైజ్ పార్క్ ఏర్పాటు చేశామని ఇప్పటికే 60కి పైగా కంపెనీలు సుల్తాన్ పూర్ లో ఉన్నాయన్నారు. ఈ పార్క్ లో పరిశోధన, పరీక్ష, తయారీ కోసం ఉత్తమ మౌలిక సదుపాయాలను అందిస్తున్నామన్నారు. డయాగ్నస్టిక్ పరికరాలు, ఇమేజింగ్ టెక్నాలజీలు, ఇంప్లాంట్లు, శస్త్రచికిత్స పరికరాలు, డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్‌లో పెట్టుబడులు వస్తున్నాయని స్థానిక స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలు గ్లోబల్ కంపెనీలతో పాటు క‌లిసి ప‌నిచేస్తున్నాయన్నారు. చాలా ఏళ్లుగా మ‌న మేథ‌స్సుని ఇత‌ర దేశాల ప్రజల కోసం ఉప‌యోగిస్తున్నాం. ఇప్పుడు మ‌న ప్రజల మంచి కోసం ప‌నిచేయాల్సిన స‌మ‌యం వ‌చ్చిందన్నారు. ఇందుకోసం మా ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని అవసరమైన సహకారాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు.

Next Story