సుస్థిర వ్యవసాయానికి ఆనవాలుగా నిలిచిన తెలంగాణ: మంత్రి నిరంజన్ రెడ్డి

by Disha Web Desk 11 |
సుస్థిర వ్యవసాయానికి ఆనవాలుగా నిలిచిన తెలంగాణ: మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ, రాజేంద్రనగర్: సుస్థిర వ్యవసాయానికి తెలంగాణ రాష్ట్రం ఆనవాలుగా మారిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతుబంధు, రైతు బీమా, సాగునీరు, నిరంతర విద్యుత్, మిషన్ కాకతీయ తదితర ఎన్నో చారిత్రాత్మక కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. తెలంగాణ రాష్ట్రావతరణ ఉత్సవాలలో భాగంగా రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో రైతు దినోత్సవం సందర్భంగా సాయంత్రం జరిగిన రాష్ట్ర స్థాయి రైతు సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో సుమారు 58 శాతం జనాభా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారని వివరించారు. రైతుబంధు వంటి ప్రోత్సాహకాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అనేక మందికి ఉపాధి లభిస్తుందన్నారు. తెలంగాణ ప్రాంతానికి, భూమికి విడదీయరాని బంధం ఉందన్నారు. భూమికోసం సాయుధ పోరాటం చేసిన చరిత్ర తెలంగాణదని మంత్రి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగం చిద్రమైందన్నారు. అందుకే వ్యవసాయం, నీళ్ల కేంద్రంగా ఏళ్ళ పాటు ఉద్యమాలు సాగాయని వివరించారు. వీటన్నింటిలోనూ ప్రత్యేక సంబంధం ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక వ్యవసాయం అభివృద్ధి కోసం ఇన్ని కార్యక్రమాలు చేపట్టారన్నారు. తనకి చిన్నప్పుడు రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలలో చదవాలన్న కోరిక ఉండేదని కానీ అప్పుడు సీటు రాలేదన్నారు.

ఇప్పుడు మంత్రి హోదాలో విశ్వవిద్యాలయానికి వస్తుంటే చాలా ఆనందంగా ఉంటుందన్నారు. వ్యవసాయం కేంద్రంగా తీసుకుంటున్న చర్యల వల్ల నేడు తెలంగాణలో సామాజిక పరివర్తన సాధ్యమైందని నిరంజన్ రెడ్డి వివరించారు. ఈ సందర్భంగా కొందరు రైతులు, విద్యార్థులు గత పదేళ్లలో వ్యవసాయ రంగం సాధించిన అభివృద్ధి గురించి తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఉత్తమ రైతులకి పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ కమిషనర్ హనుమంత రావు, ఆయిల్ పామ్ సలహాదారు శ్రీనివాసరావు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మిబాయి, PJTSAU ఇంచార్జి రిజిస్ట్రార్, పరిశోధనా సంచాలకులు డాక్టర్ ఎం. వెంకటరమణ విశ్వవిద్యాలయ అధికారులు, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, రైతులు, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు, విద్యార్థినీ, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed