ఐదేండ్లుగా బదిలీల్లేవు.. గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ డిమాండ్

by Dishafeatures2 |
ఐదేండ్లుగా బదిలీల్లేవు.. గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులకు (టీచింగ్, నాన్ టీచింగ్) ఐదేండ్లుగా బదిలీలు చేపట్టలేదని తెలంగాణ ఇంటర్ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. బదిలీలు లేక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ మానసిక వేదనను అనుభవిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి అనేక సార్లు బదిలీలు చేపట్టాలని విజ్ఞప్తి చేశామని, అయినా సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం 2018 జూన్ లో సాధారణ బదిలీలకు అవకాశం కల్పించిందని, అప్పుడు దాదాపు 500 మంది ఉద్యోగులు బదిలీ అయ్యారన్నారు. కానీ 2016, 2017లో జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్స్ గా పదోన్నతులు రావడంతో బదిలీలకు కనీస సర్వీస్ 2 సంవత్సరాలు ఉండాలన్న నిబంధన కారణంగా 2018లో జరిగిన బదిలీలలో వారికి అవకాశం రాలేదన్నారు. దీంతో ఉద్యోగుల కుటుంబాలు మానసికంగా, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు.

ప్రభుత్వం 23 సంవత్సరాలుగా కాంట్రాక్టు అధ్యాపకులుగా పనిచేస్తున్న 3,600 మందిలో 3,096 మంది కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీస్ లను రెగ్యూలర్ చేస్తూ వారు పనిచేస్తున్న కళాశాలలో పోస్టింగ్ ఇచ్చారు. వారికి 13 ఏండ్లుగా బదిలీలు లేకపోవడం వల్ల దాదాపు 20 సంవత్సరాలుగా ఒకే కళాశాలలో పనిచేస్తూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ టీఎస్ పీఎస్సీ ద్వారా 1400 మంది జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది. సెప్టెంబర్ లో పరీక్ష నిర్వహించనుంది. అందుకే రెగ్యులర్ ఉద్యోగులకు ఇబ్బందులు తలెత్తకుండా, జీరో సర్వీస్ ఉద్యోగులకు కూడా సాధారణ బదిలీలు చేపట్టాలని గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed