ప్రీతి కేసులో నిందితుడ్ని కాపాడేందుకు హోంమంత్రి ప్రయత్నం?

by Disha Web Desk 2 |
ప్రీతి కేసులో నిందితుడ్ని కాపాడేందుకు హోంమంత్రి ప్రయత్నం?
X

దిశ, డైనమిక్ బ్యూరో: వరంగల్ పీజీ మెడికల్ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అందింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ విద్యార్థి సైఫ్ అనే వ్యక్తి రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీకి బంధువని అందువల్ల తన బంధువును కాపాడుకునే ఉద్దేశంతో ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారంటూ కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌కు శుక్రవారం కంప్లైంట్ చేశారు. సైఫ్ వేధిస్తున్నాడని ప్రీతి పేరెంట్స్ ఫిర్యాదు చేసినా కేఎంసీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతోనే ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిందని బక్క జడ్సన్ అన్నారు.

బాధితురాలితో సైఫ్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆ అవమానం తట్టుకోలేకే ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందన్నారు. ఈ కేసు నుంచి సైఫ్‌ను తప్పించేందుకు హోం మంత్రి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇటీవలే మెదక్ పోలీసుల చేతిలో దెబ్బలు తిని మరణించిన ఖదీర్ ఖాన్ మరణంపై నోరు మెదపని మహమూద్ అలీ ప్రీతి కేసులో మాత్రం తన బంధువైన సైఫ్ ను కాపాడాలనుకుంటున్నాడని ఆరోపించారు. హోం మంత్రి తన బంధువులు కాపాడుకునేందుకే పదవిలో ఉన్నాడా అని ప్రశ్నించారు.

Next Story

Most Viewed