అన్ని రకాల పంటలు పండించే శక్తి తెలంగాణకే ఉంది: మంత్రి నిరంజన్ రెడ్డి

by Disha Web Desk 11 |
అన్ని రకాల పంటలు పండించే శక్తి తెలంగాణకే ఉంది: మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, వనపర్తి: ప్రపంచంలో అన్ని రకాల పంటలు పండించే శక్తి ఒక తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఉందని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం జిల్లా కేంద్రం సమీపంలోని నాగవరం రైతు వేదిక వద్ద ఘనంగా రైతు దినోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాకముందు రాష్ట్రంలో వ్యవసాయం కుంటు పడిందని సాగునీరు లేక, పంటలు పండించలేక చాలామంది రైతులు పక్క రాష్ట్రాలకు వలస వెళ్లేవారని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒక రైతు బిడ్డ అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు ఈ తొమ్మిదేళ్లలో ఒక వ్యవసాయ రంగానికి దాదాపు నాలుగు లక్షల కోట్లు ఖర్చుపెట్టి రాష్ట్రాన్ని పంటలతో సస్యశ్యామలం చేశారన్నారు. వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేసి మిషన్ కాకతీయ ద్వారా చెరువులను మరమ్మత్తు చేసి గ్రామ, గ్రామానికి సాగునీరు అందేలా చేశారని ఆయన అన్నారు. దీంతో వలస వెళ్లిన రైతులందరూ వెనక్కి వచ్చి పంట పొలాలను దుక్కి దున్ని ధాన్యపురాశులను పండించారని మంత్రి చెప్పారు. ఇప్పుడు తెలంగాణ పంటల ద్వారా దేశానికిే అన్నం పెట్టే విధంగా రైతన్నలు ఎదిగారని, అలాంటి రైతులను మనం కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.

నాడు వ్యవసాయం దండగ అన్న చోటే నేడు పండుగలు జరుపుకుంటున్నామని దీనికంతటికీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ నే కారణం అన్నారు. రాష్ట్రంలో జీవ వైవిధ్యం పెరిగిందని అన్నారు. వలసల జిల్లాగా ఒకనాడు పేరు పొందిన పాలమూరు ఇప్పుడు వ్యవసాయాల్లో లాభాల బాట పట్టిందని చెప్పారు. ప్రభుత్వం అందించే రైతు బీమా, రుణమాఫీ వంటి పథకాలతో సంతోషంగా ఉన్నారని, అయినా దీనిని ఇంతటితో ఆపకుండా వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా మలుచుకోవాలని అప్పుడే వేలాదిమంది ఉపాధి పొందుతారని మంత్రి సూచించారు. సాంప్రదాయ వ్యవసాయానికి స్వస్తి పలకాలని ఎప్పుడో ఒకే రకమైన పంటలు పండించకుండా సమీకృత వ్యవసాయం వైపు మల్లాలని, అన్ని రకాల ఆహారం పంటలను పండించాలని రైతులకు ఆయన సూచించారు.

ఒక రైతు బిడ్డ అయినా నేను నా ప్రాణం ఉన్నంతవరకు రైతుల కోసం, రైతుల పక్షాన ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చందు, జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో జెసి వేణుగోపాల్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, మార్కెట్ చైర్మన్ రమేష్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.






Next Story

Most Viewed