మేడారం వెళ్లే భక్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

by Disha Web Desk 2 |
మేడారం వెళ్లే భక్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
X

దిశ, వెబ్‌డెస్క్: మేడారం మహా జాతరకు వెళ్లే భక్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భక్తుల రవాణా సౌకర్యార్థం మరో 100 బస్సులు మేడారానికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం అధికారికంగా ప్రకటించారు. అంతకుముందు రాష్ట్రంలో 100 నూతన బస్సులను టీఎస్‌ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిని ట్యాంక్‌బండ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అంతేకాదు.. ఆర్టీసీ కార్మికులకు భారీ ఊరట కలిగేలా పాత బకాయిలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం కార్మికుల బకాయిలు 280 కోట్లను విడుదల చేశారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఆర్టీసీకి రూ.500 కోట్లు ఇచ్చామని తెలిపారు.

మహాలక్ష్మి పథకం మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని.. రెండు నెలల్లో 15కోట్ల 21లక్షల మంది మహిళలు జీరో టికెట్‌తో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని చెప్పారు. మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించిన 535 కోట్ల చెక్కును ఆర్టీసీ సంస్థకు అందించారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.


Next Story