పార్టీ బలోపేతానికి టీ-కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. ఓల్డ్ సిటీ నుంచే టాస్క్!

by GSrikanth |
పార్టీ బలోపేతానికి టీ-కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. ఓల్డ్ సిటీ నుంచే టాస్క్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో టీ-కాంగ్రెస్​బలోపేతానికి చాన్స్ దొరికింది. ఇందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లింలను తమవైపు తిప్పుకునేందుకు ప్లాన్​వేసింది. ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా చేసిన వ్యాఖ్యాలను ఆ వర్గాల్లోకి బలంగా తీసుకెళ్లాలని టాస్క్‌గా తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 44 లక్షల మందికి పైగా ముస్లింల జనాభా ఉంటుందని అంచనా. వీరికి అమిత్​షా వ్యాఖ్యలను చేరవేసేందుకు పార్టీ అంతర్గతంగానూ తీర్మానించుకుంది. దీని బాధ్యతలను టీపీసీసీ మైనార్టీ కాంగ్రెస్​నేతలకు అప్పగించింది. దీంతో ఆ వర్గ నేతలు కూడా జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు డిసైడ్ అయ్యారు. గ్రేటర్​హైదరాబాద్​తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారంలోకి దిగుతారు. కాంగ్రెస్​పాలనలోనే ముస్లింలకు న్యాయం జరిగిందంటూ స్టిక్కర్లు కూడా అందించేందుకు భావించింది. అన్ని జిల్లాల్లోని మైనార్టీ లీడర్లు, ముఖ్య కార్యకర్తల వివరాలను వెంటనే పంపాలని టీ పీసీసీ కూడా కోరింది. అనంతరం కమిటీలు వేసి కొత్త టాస్క్ ను సమర్థవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోనుంది.

పాత గూటికి చేర్చేలా..

కాంగ్రెస్​అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం వర్గాలు తమతో సన్నిహితంగానే ఉన్నట్లు కాంగ్రెస్​నేతలు గుర్తు చేసుకుంటూ.. వక్ఫ్​బోర్డు అభివృద్ధి, రిజర్వేషన్ల అంశంలో పార్టీ న్యాయం చేసిందని పేర్కొంటున్నారు. సెక్యులర్​భావజాలంతో మైనార్టీ వర్గాలను కాంగ్రెస్ మాత్రమే​కాపాడిందని చెప్పుకొస్తున్నారు. అయితే స్వరాష్ట్రం వచ్చాక బీఆర్ఎస్ (పాత టీఆర్ఎస్) ప్రభావంతో కొంత శాతం ముస్లిం వర్గం వేరు పడిందని, ఇప్పుడు మళ్లీ పాత పార్టీ గూటికి చేర్చేలా ప్రయత్నాలు షురూ చేస్తున్నట్టు కొందరు కాంగ్రెస్​చెందిన నేతలు చెబుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్​ఒకటేనని వివరిస్తూ.. ప్రధానంగా అమిత్​షా వ్యాఖ్యలపై ముస్లింవర్గాలకు తెలియజెప్పుతూ.. మసీదులు, దర్గాల వద్ద కూడా కరపత్రాలను అందజేయనుంది. మైనార్టీ స్కూళ్లు, కాలేజీల్లోనూ షా వ్యాఖ్యలను వివరించేందుకు కాంగ్రెస్​నేతలు కార్యాచరణను రూపొందించారు. ఏఐసీసీకి కూడా ఇదే చెప్పారు. థాక్రే పర్మిషన్​తర్వాత రాష్ట్రమంతటా ప్లాన్ అమలు చేయనున్నట్టు కాంగ్రెస్ కు చెందిన ఓ ముస్లిం నేత తెలిపారు.

ఎంఐఎం ముఖ్యనేతలతోనూ చర్చ

మతాలను రెచ్చకొడుతూ బీజేపీ పబ్బం గడుపుకుంటుందని కాంగ్రెస్ నేతలు ముస్లిం వర్గాలకు చెందిన ఇమామ్ లు, మత పెద్దలకు వివరించనున్నారు. ఇందుకు కాంగ్రెస్​మైనార్టీ సెల్​వింగ్ ఆధ్వర్యంలో ముస్లిం మత పెద్దలు, మసీదు నిర్వాహకులు, ఇమామ్ లతో ప్రత్యేక భేటీలు ఏర్పాటు చేయనున్నారు. పాతబస్తీ నుంచే ఈ టాస్క్ ను స్టార్ట్​చేయాలని కాంగ్రెస్​ప్రయత్నిస్తున్నది. ఇక ఎంఐఎం ముఖ్య నేతలతో కూడా అమిత్ షా వ్యాఖ్యలపై మైనార్టీ సెల్​చర్చించనున్నది. బీజేపీ సహజంగానే అగ్రకులాలకు ప్రాధాన్యం ఇస్తుందని, ఇప్పుడు ముస్లింలను డిస్టర్బ్ చేసినట్లే రాబోయే రోజుల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లోని అన్ని మతస్తులు, కులాలను ఇబ్బంది పెట్టే ప్రమాదముందని, ప్రతి ఏరియాలో ఒక సభను ఏర్పాటు చేసి చర్చించనున్నారు. ఈ టాస్క్​సక్సెస్​అయితే కాంగ్రెస్​కు అన్ని నియోజకవర్గాల్లో మరింత పట్టు లభించనున్నది.

Next Story

Most Viewed