జలమండలికి కోత.. మూసీకి ప్రాధాన్యం

by Naga Rani Yarlagadda |

గత బడ్జెట్ తో పోలిస్తే.. ఈ ఏడాది జలమండలికి బడ్జెట్ కేటాయింపుల్ని ప్రభుత్వం భారీగా తగ్గించింది.

జలమండలికి కోత.. మూసీకి ప్రాధాన్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మహా నగరానికి తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ సంస్థ అయిన జలమండలికి రాష్ట్ర బడ్జెట్‌లో గతేడాది కన్నా ఈ సారి నిధులు తగ్గించారు. పథకాలు, లోన్లు కలిపి గతేడాది రూ.5,470 కోట్లు కేటాయిస్తే ఈ సారి రూ.3,305 కోట్లు కేటాయించారు. జలమండలి ఆధ్వర్యంలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు రూ.1,450 కోట్లు కేటాయించించింది. కృష్టా తాగునీటి పథకంలో భాగంగా చేపట్టిన సుంకిశాల ప్రాజెక్టు పనులు చేపట్టడానికి గత బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.3,085 కోట్లు కేటాయించింది. ఈ సారి ఈ ప్రాజెక్టు లోన్ కోసం రూ.1000 కోట్లు కేటాయించింది. ఇతర లోన్ల కోసం మరో రూ.555 కోట్లు కేటాయించింది. ఉచిత తాగునీటి పథకానికి గత ఏడాది రూ.300 కోట్లు ఇవ్వగా.. ఈ ఏడాది అంతే మొత్తంలో వెచ్చించనున్నారు.

మూసీ పునరుజ్జీవనానికి రూ.1500 కోట్లు

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు రూ.1500 కోట్లు కేటాయించారు. గతేడాది రూ.1500 కోట్లు కేటాయించారు. అయితే 2024లో మూసీ ప్రాజెక్టులకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించి మార్కింగ్ చేయడంతోపాటు కొన్ని ఇండ్లను కూల్చేశారు. బాధితులందరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించారు. మొదటి దశలో ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్, హిమాయత్ సాగర్ నుంచి బాపు ఘాట్ వరకు 21 కిలోమీటర్ల ప్రాజెక్టు చేపట్టడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

హెచ్ఎండీఏకు రూ.1500 కోట్లు

రాష్ట్ర బడ్జెట్‌లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)కి నిరాశే ఎదరైంది. గత రెండు బడ్జెట్ల కన్నా ఈ సారి ఎక్కువగానే కేటాయించింది. రూ.5 వేల కోట్ల నిధులు కేటాయించాలని హెచ్ఎండీఏ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. కానీ ప్రభుత్వం మాత్రం రూ.1500 కోట్లను మాత్రమే కేటాయించింది. అయితే హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చేపట్టనున్న రెండు ఎలివేటెడ్ కారిడార్లు, రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ల నిర్మాణానికి ఎలాంటి నిధులు కేటాయించలేదు. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోన్ కోసం రూ.1000 కోట్లు, ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన లోన్లకు మరో రూ.500 కోట్లు కేటాయించింది.

మెట్రోరైలుకు రూ.1100 కోట్లు

హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టుకు బడ్జెట్‌లో రూ.1100 కోట్లు కేటాయించారు. వీటిలో మొదటి దశ ప్రాజెక్టులో లోన్ కోసం రూ.500 కోట్లు కేటాయించింది. దీంతోపాటు మెట్రోరైలు రెండో దశ కోసం రూ.600 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌లో పాతబస్తీలో చేపట్టిన మెట్రో నిర్మాణానికి రూ.500 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. హైడ్రాకు బడ్జెట్‌లో రూ.111.48 కోట్లు కేటాయించారు. ఎస్టాబ్లిష్‌మెంట్‌కు రూ.61.48 కోట్లు, డెవలప్‌మెంట్ పనుల కోసం రూ.50 కోట్లు కేటాయించింది.

Next Story