వాళ్లు తలుచుకుంటే ప్రభుత్వాలే గల్లంతవుతాయి: బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
వాళ్లు తలుచుకుంటే ప్రభుత్వాలే గల్లంతవుతాయి: బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: చార్టెడ్ అకౌంటెంట్లు తలుచుకుంటే ప్రభుత్వాలే గల్లంతవుతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ఆధ్వర్యంలో హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో శనివారం నిర్వహించిన స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూపీఏ హయాంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని, కాగ్ ఇచ్చిన నివేదికలతోనే 2జీ స్కాం, బొగ్గు స్కాంలు బయటపడ్డాయని సంజయ్ అన్నారు. తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఖతమైందని, ఆ పార్టీ అడ్రస్సే గల్లంతైందని సంజయ్ గుర్తు చేశారు.

ఈ దేశ ఆర్థిక ప్రగతికి బ్రాండ్ అంబాసిడర్లు చార్టెడ్ అకౌంటెంట్లు అని బండి పేర్కొన్నారు. నవ భారత జాతి నిర్మాతలు సీఏలని అభివర్ణించారు. తమ క్లయింట్ల విషయంలో నిజాయితీగా పనిచేయాలని, లాభాలొచ్చినా, నష్టాలొచ్చినా వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం సీఏలపై ఉందని బండి సంజయ్ సూచించారు.

సీఏలు సక్రమంగా పన్నులు కట్టిస్తుండటం వల్లే ఈ దేశం పురోగమిస్తోందని బండి కొనియాడారు. 2047 నాటికి భారత్‌ను నంబర్ వన్ చేయాలని ప్రధాని మోడీ భావిస్తున్నారని, ఆయన కృషిలో సీఏలు భాగస్వాములు కావాలని ఆయన పేర్కొన్నారు. పాస్ పోర్ట్ నిరాకరించిన దేశాలే ఆయనకు రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుతున్నాయని గుర్తుచేశారు.

స్నాతకోత్సవానికి హాజరుకావడం చాలా సంతోషంగా ఉందని బండి సంజయ్ చెప్పారు. స్టైల్‌గా మాట్లాడటం తనతో కాదని, తాను మాస్ లీడర్‌ని అని బండి చెప్పుకొచ్చారు. స్నాతకోత్సవంలో ఉన్న చార్టెడ్ అకౌంటెంట్లు సైతం క్లాస్‌లో మాస్‌లా కనిపిస్తున్నారని సంజయ్ అన్నారు. సీఏ చాలా టఫ్ కోర్స్ అని, నూటికి ఒక్కరు కూడా పాస్ కాలేని పరిస్థితి ఉంటుందని, అయినా పట్టుదల, కసితో చదివి పాసయ్యారని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఒకప్పుడు ట్యాక్స్ పేయర్స్‌ను దొంగలుగా చూసేవాళ్లని అన్నారు.

గతంలో ఇండియన్స్ అంటే పాములు పట్టేవాళ్లు, మూర్ఖులు, అజ్ఞానులనే భావన ఇతర దేశస్తులకు ఉండేదని, ఇప్పుడు విజ్ఞానంలో టాపర్స్‌గా గుర్తిస్తున్నారని సంజయ్ అన్నారు. విద్యార్థులు జీవితంలో దేనికీ భయపడొద్దని, ఇప్పటి వరకు తాను ఏడు సార్లు జైలుకు వెళ్లొచ్చానని, బోలెడన్ని కేసులు పెట్టారని, అయినా తాను భయపడనని బండి సంజయ్ చెప్పారు. ప్రతి క్షణం దేశం, ధర్మం, పేదల కోసం పనిచేయాలనే తపనతోనే ముందుకు వెళతానని బండి సంజయ్ స్పష్టంచేశారు.


Next Story

Most Viewed