కామ్రేడ్ బేబ‌క్కకు క‌న్నీటి వీడ్కోలు .. కేఎంసీకి భౌతిక‌కాయం అప్పగింత

by Disha Web Desk 11 |
కామ్రేడ్ బేబ‌క్కకు క‌న్నీటి వీడ్కోలు .. కేఎంసీకి భౌతిక‌కాయం అప్పగింత
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: గోదావ‌రి లోయ ప్రతిఘ‌ట‌న పోరాట యోధురాలు, అడ‌వి అన్నల‌కు వార‌ధి, ఆదివాసీల ఆడ‌బిడ్డగా విప్లవోద్యమంలో పేరుగాంచిన‌ కామ్రేడ్ నిమ్మగడ్డ స‌రోజ‌న అలియాస్ బేబ‌క్కకు విప్లవ సంఘాల నేత‌లు, ప్రజ‌లు క‌న్నీటి వీడ్కోలు ప‌లికారు. కొత్తగూడ‌, న‌ర్సంపేట‌లో ఆమె అంతిమ‌యాత్ర‌, సంతాప స‌భ‌లో సీపీఐఎంసీ న్యూడెమోక్రసీ నేత‌లు, నాయ‌కులతోపాటు విప్లవ‌ శ్రేణులు, అభిమానులు, ప్రజ‌లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దారి పొడ‌వునా ఆమెకు జోహార్లు ప‌లికారు. అనంత‌రం వ‌రంగ‌ల్ కాక‌తీయ మెడిక‌ల్ క‌ళాశాల‌కు ఆమె భౌతిక కాయాన్ని అందజేశారు. అంత‌కుముందు కేఎంసీ గేట్ నుంచి క‌ళాశాల భ‌వ‌నం వ‌ర‌కు ర్యాలీగా త‌ర‌లివెళ్లారు.

విప్లవ‌ గేయాల‌తో ఆమెకు నివాళుల‌ర్పించారు. కామ్రేడ్ నిమ్మగడ్డ సరోజన అలియాస్ బేబక్క శుక్రవారం సాయంత్రం తన స్వగ్రామమైన మ‌హ‌బూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుండంపల్లిలో మ‌ర‌ణించారు. కామ్రేడ్ బేబక్క తన చిన్న వయసు నుంచే విప్లవోద్యమంలో పనిచేస్తూ అంచెలంచలుగా ఎదిగారు. ఏజెన్సీ ఆదివాసీ గిరిజన ప్రాంతంలో పనిచేశారు. ఆదివాసీ గిరిజన బడుగు బలహీన పేద వర్గాల కోసం నిస్వార్థంగా విప్లవ ప్రతిఘటన పంథాలో ఉద్యమించారు. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో అనేక నిర్బంధాలను ఎదుర్కొన్నారు. పాల‌క వ‌ర్గాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఆదివాసీలకు బాసటగా నిలిచారు.

కామ్రేడ్ బేబక్క పాలడు కృష్ణ నాయకత్వంలో కొత్తగూడ గంగారం నర్సంపేట ఏరియా ప్రాంతాలలో అనేక పోడు భూములను కొట్టించి ఫారెస్ట్ దాడులను ఎదుర్కొని పేద ప్రజలకు పోడు భూములను పంచారు. తునికాకు కూలి రేట్లకై పోరాడారు. పాకాల కొత్తగూడా ఏరియా ప్రాంతంలో పనిచేస్తున్న అజ్ఞాత దళాలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ తను తుది శ్వాస వరకు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన కామ్రేడ్ బేబక్క మరణం విప్లవ ప్రతిఘటన ఉద్యమానికి తీరని లోటని ప‌లువురు నాయ‌కులు ఆవేద‌న వ్యక్తం చేశారు.

కేఎంసీలో సంతాప స‌భ‌..

కేఎంసీలో న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. ఈ సభకు నాయకులు బండి కోటేశ్వరరావు అధ్యక్షత వహించగా సీపీఐ ఎంఎల్ ప్రజా పంథా రాష్ట్ర నాయకులు కామ్రేడ్ చిన్న చంద్రన్న, రాయల చంద్రశేఖర్, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు నున్నా అప్పారావు, అమరుల బంధుమిత్రుల సంఘం నాయకురాలు బేబక్క, టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి భోగేశ్వర్, ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షులు గంగుల దయాకర్, న్యూ డెమోక్రసీ నాయకులు రాచర్ల బాలరాజుతోపాటు పలువురు మాట్లాడారు.

కామ్రేడ్ బేబక్క పీడిత ప్రజల కోసం చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. దోపిడీ వర్గాల నుంచి దేశం కోసం నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం చేయడమే విప్లవకారుల అంతిమ లక్ష్యమని అంటూ ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. ప్రజా కళాకారులు కామ్రేడ్ బీకే, యోచన బేబక్కను స్మరిస్తూ పాటలు పాడారు. ఈ సంతాప సభకు పెద్ద ఎత్తున వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గండ్రాతి హరిబాబు, కొత్తపెల్లి రవి, బి నరసింహారావు, బండి చంద్రమౌళి, నల్లిగంటి విజయ పాల్ ఎర్ర జయ బాబు, మన్నే కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed