‘తెలంగాణను కించపరచలేదు’ - టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్లారిటీ

by Ramesh Naini |

పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి.

‘తెలంగాణను కించపరచలేదు’ - టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్లారిటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. తాజాగా జరిగిన లోక్‌సభ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంపై ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 14, 2014 ను బ్లాక్ డేగా అభివర్ణించారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. ఏపీ ఎంపీలు తెలంగాణపై ఏడుపు ఆపాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ హెచ్చరించారు. పార్లమెంటులో ఏపీ ఎంపీల వ్యాఖ్యలపై ‘ఎక్స్‌’ వేదికగా ఆయన స్పందించారు. రాష్ట్రం విడిపోయి పన్నెండేండ్లు గడుస్తున్నా తెలంగాణపై విషం చిమ్మడం ఏమిటని ప్రశ్నించారు. లోక్‌సభ వేదికగా తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచేలా ఎంపీ లావు కృష్ణదేవరాయలు మాట్లాడారని మండిపడ్డారు. ఏపీ అభివృద్ధికి ఏం కావాలో అడిగే తెలివి లేక, తెలంగాణపై పడి ఏడవడం పరిపాటిగా మారిందని ఆయన పేర్కొన్నారు. అనవసరంగా మా జోలికి వచ్చి తెలంగాణ ప్రజలను అవమానిస్తే, కించ పరిచే విధంగా రాష్ట్ర ఏర్పాటుపై వాగితే మాత్రం తెలంగాణ సమాజం తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు.

తెలంగాణను కించపరిచేలా నేను మాట్లాడలేదు.. టీడీపీ ఎంపీ

ఈ వివాదంపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నేను తెలంగాణను వ్యతిరేకించలేదని, తెలంగాణను కించపరిచేలా మాట్లాడలేదు.. అని ఆయన స్పష్టం చేశారు. బిల్లు ఆమోదం సమయంలో స్పీకర్ తీరుపై మాత్రమే మాట్లాడాను.. అప్పటి స్పీకర్ మీరా కుమార్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని మాత్రమే ప్రస్తావించినట్లు వివరణ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు సెంటిమెంట్‌ను రాజేయొద్దని రిక్వెస్ట్ చేశారు.

Next Story