MLA మైనంపల్లిపై వేటుకు BRS రంగం సిద్ధం.. మల్కాజిగిరి బరిలో KTR అనుచరుడు..?

by Disha Web Desk 19 |
MLA మైనంపల్లిపై వేటుకు BRS రంగం సిద్ధం.. మల్కాజిగిరి బరిలో KTR అనుచరుడు..?
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల టికెట్ల ప్రకటనతో అధికార బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి భగ్గుమంటుంది. కేసీఆర్ ప్రకటించిన ఫస్ట్ లిస్ట్‌తో టికెట్ ఆశావాహులు తీవ్ర నిరాశలో ఉన్నారు. సిట్టింగ్‌లకే కేసీఆర్ మెజార్టీ టికెట్లు కేటాయించడంతో నియోజకవర్గాల్లోని సెకండ్ క్యాడర్ సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్ దక్కని నేతలు గోడ దూకేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు వచ్చే ఎన్నికల్లో తన కొడుక్కి టికెట్ ఆశించాడు. మెదక్ సెగ్మెంట్ నుండి కొడుకుని బరిలోకి దించాలనుకున్నాడు. అయితే, మెదక్ సీటును మరోసారి సీఎం కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికే కేటాయించారు. తన కొడుక్కి టికెట్ రాకుండా మంత్రి హరీష్ రావే అడ్డుకున్నాడని ఎమ్మెల్యే మైనంపల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మెదక్‌లో హరీష్ రావుకు ఏం పని అని.. హరీష్ రావుకు తన తడాఖా ఏంటో చూపిస్తానని తిరుమల వెంకటేశ్వరుడి సాక్షిగా మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌లో అగ్రనేత, మంత్రి అయిన హరీష్ రావుపై ఎమ్మెల్యే మైనంపల్లి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లో తీవ్ర దుమారం రేపాయి. ఏకంగా మంత్రి హరీష్ రావుపైనే సొంత పార్టీ ఎమ్మెల్యే అవినీతి ఆరోపణలు చేయడం అధికార పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే మైనంపల్లి వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఇతర బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. ఈ నేపథ్యంలో మైనంపల్లిపై బీఆర్ఎస్ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు మైనంపల్లిపై ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం బీఆర్ఎస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మైనంపల్లిపై వేటుకు రంగం సిద్ధం..?

మంత్రి హరీష్ రావుపై ఎమ్మెల్యే మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు చేసి దాదాపు వారం గడిచిన బీఆర్ఎస్ అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మైనంపల్లి పార్టీ మారితే జరిగే డ్యామేజ్ అంచనా వేసేందుకు బీఆర్ఎస్ అధిష్టానం సైలెంట్‌గా ఉందని పొలిటికల్ సర్కిల్స్ చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో మైనంపల్లిని బుజ్జగించేందుకు సైతం ఓ బీఆర్ఎస్ కీలక నేత రంగంలోకి దిగినప్పటికీ.. మైనంపల్లి పట్టువీడనట్లు టాక్.

దీంతో మైనంపల్లిపై సస్పెన్షన్ వేటుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఇప్పటికే మల్కాజిగిరి సెగ్మెంట్‌కు మైనంపల్లికి బీఆర్ఎస్ టికెట్ కన్ఫార్మ్ చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ మైనంపల్లిపై వేటు వేస్తే ఆయన దీటుగా మరో అభ్యర్థిని మల్కాజిగిరిలో నిలబెట్టుందుకు సైతం బీఆర్ఎస్ కసరత్తు మొదలుపెట్టినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తుంది.

తెరపైకి శంభీపూర్..?

ఎమ్మెల్యే మైనంపల్లిపై వేటు వేస్తే మల్కాజిగిరిలో మరో బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. బీఆర్ఎస్‌పై తిరుగుబాటు చేసి వెళ్లిన మైనంపల్లిని ఓడించేందుకు బలమైన అభ్యర్థి కోసం గాలిస్తున్న బీఆర్ఎస్ హైకమాండ్.. మంత్రి కేటీఆర్ అనుచరుడిగా పేరున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును మైనంపల్లిపై పోటీకి నిలబెట్టాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఓ పక్కా ఈ ప్రచారం బలంగా జరుగుతుండగానే.. ఎమ్మె్ల్సీ శంభీపూర్ రాజు సోమవారం మంత్రి హరీష్ రావుతో భేటీ కావడం ఈ వార్తలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

టికెట్ అంశంపై చర్చించేందుకే హరీష్ రావుతో శంభీపూర్ భేటీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ మైనంపల్లిపై వేటు పడితే.. మల్కాజిగిరి నుండి శంభీపూర్ రాజు బరిలోకి దిగే చాన్స్ ఎక్కువగా ఉన్నట్లు పొలిటికల్ కారిడార్‌లో చర్చ జరుగుతోంది. ఇక, మల్కాజిగిరికి కొత్త అభ్యర్థి ప్రకటనతో పాటు మిగిలిన మరో నాలుగు సీట్లును సైతం బీఆర్ఎస్ ఖరారు చేయనున్నట్లు సమాచారం. జనగాం సీటు ఎమ్మెల్సీ పల్లా, నర్సాపూర్ సునీత లక్ష్మారెడ్డి, నాంపల్లి ఆనంద్ గౌడ్, గోషామహాల్ నందకిషోర్ వ్యాస్ పేర్లు ఖరారు చేశారని.. మరో రెండు మూడు రోజుల్లో ఈ పేర్లు అధికారికంగా ప్రకటించనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.


Next Story

Most Viewed