ఆ పనిని కూడా సరిగ్గా చేయలేని దద్దమ్మ మంత్రి కేటీఆర్: బండి సంజయ్ ఫైర్

by Disha Web Desk 19 |
ఆ పనిని కూడా సరిగ్గా చేయలేని దద్దమ్మ మంత్రి కేటీఆర్: బండి సంజయ్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్సీ కవితపై తాను చేసిన వ్యాఖ్యల్లో మరో ఉద్దేశ్యం లేదని, తాను కేవలం తెలంగాణలో ఒక సామెతగా మాత్రమే చెప్పానని తెలంగాణ మహిళా కమిషన్ ఎదుట సమాధానం చెప్పినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. తెలంగాణ మహిళా కమిషన్‌లో విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళా కమిషన్ రాజ్యాంగ బద్ధమైన సంస్థ అని, ఆ సంస్థపై తనకు నమ్మకం ఉందన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే విచారణకు హాజరయ్యానని ఆయన క్లారిటీ ఇచ్చారు. వారు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానాలిచ్చానని, పూర్తిగా సహకరించానని తెలిపారు. వారు తన స్టేట్ మెంట్స్‌ను రికార్డు చేశారన్నారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో బీజేపీ హస్తముందంటూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. పేపర్ లీకేజీలో బీజేపీ హస్తముంటే ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. పేపర్ లీకేజీలో ఐటీ శాఖ తప్పిదాలున్నాయని, అందుకే కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నిజంగా తప్పు చేయకపోతే సిట్టింగ్ జడ్జితో ఎందుకు విచారణ జరిపించడం లేదని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్‌లో తనకు నచ్చనివాళ్లు తప్పు చేస్తే మెడలు పట్టి గెంటివేసే కేసీఆర్.. తన కొడుకు తప్పు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. పరీక్షలు సక్రమంగా నిర్వహించే తెలివిలేని కేటీఆర్.. కామన్ సెన్స్ గురించి మాట్లాడుతున్నాడని విమర్శలు చేశారు.

ఎవరి నిర్వాకం వల్ల ఇంటర్మీడియట్ పిల్లలు చనిపోయారని, ధరణివల్ల లక్షల మంది రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారని ఆయన ప్రశ్నించారు. కుక్కలు కరిచి పిల్లలు చనిపోతే, నాలాల్లో పడి జనం చస్తే, సిటీలో ఫైర్ యాక్సిడెంట్ల వల్ల చనిపోతున్నా మంత్రి కేటీఆర్ పట్టించుకోకుండా, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

టీఎస్పీఎస్సీ రాజ్యాంగ బద్ధ సంస్థ అని అంటున్నాడని, మరి ఈడీ, సీబీఐ రాజ్యాంగ బద్ద సంస్థలు కావా అని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ చెప్పినట్లు వినేవి మాత్రమే రాజ్యాంగబద్ద సంస్థలా? లేదంటే బీజేపీ సంస్థలా అని ఆయన ధ్వజమెత్తారు. 30 లక్షల మంది జీవితాలను నాశనం చేసి కనీసం వాళ్లకు భరోసా కల్పించే ప్రయత్నం చేయకుండా గాలి కొదిలేసి లిక్కర్ క్వీన్‌ను కాపాడుకునేందుకు ఢిల్లీకి పోయి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శలు చేశారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లంతా చెంప చెళ్లుమనిపించినా బుద్ధి రాలేదా అని ఎద్దేవా చేశారు. పేపర్ లీకేజీలో బీజేపీ హస్తముందని ఆరోపిస్తున్నారని, మరి నిజంగానే అలా చేస్తే ఎందుకు అరెస్ట్ చేయలేదని బండి ప్రశ్నించారు. లీకేజీలో నిందితుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి బీజేపీ వ్యక్తని అంటున్నారని, 10 ఏళ్లకుపైగా అతడు ఉద్యోగిగా పనిచేస్తుంటే దొంగలను గుర్తించడం చేతకాలేదా అని విమర్శలు చేశారు.

కనీసం పరీక్షలు సరిగ్గా నిర్వహించలేని దద్దమ్మ కేటీఆర్ అని మండిపడ్డారు. టీఎస్ పీఎస్సీ బోర్డు ఎందుకు పనికిరాకుండా పోయిందని, ఇక దాంతో ఏం పనుందని ఆయన ప్రశ్నించారు. బోర్డును రద్దు చేసే అధికారం సీఎంకు లేదని అంటున్నారని, మరి రద్దు చేసే అధికారం ఎవరికుందో.. వాళ్లకే లెటర్ ఎందుకు రాయడం లేదని బండి ప్రశ్నించారు.

Also Read..

నేను మాట్లాడింది తెలంగాణలో సాధారణ భాషే : బండి సంజయ్


Next Story

Most Viewed