ఫిట్‌నెస్‌ లేని వాహనాలు సీజ్‌ చేయండి.. చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై సుప్రీంకోర్టు రోడ్డు భద్రత కమిటీ సమీక్ష

by Ramesh Naini |   (  Updated:2025-11-06 16:55:27  IST  )

చేవెళ్ల వద్ద ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సుప్రీంకోర్టు రోడ్డు భద్రత కమిటీ ఇవాళ (గురువారం) సమీక్ష నిర్వహించింది.

ఫిట్‌నెస్‌ లేని వాహనాలు సీజ్‌ చేయండి.. చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై సుప్రీంకోర్టు రోడ్డు భద్రత కమిటీ సమీక్ష
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: (Chevella road accident) చేవెళ్ల వద్ద ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సుప్రీంకోర్టు రోడ్డు భద్రత కమిటీ (Supreme Court Road Safety Committee) ఇవాళ (గురువారం) సమీక్ష నిర్వహించింది. హైదరాబాద్‌కు విచ్చేసిన కమిటీ చైర్మన్ న్యాయమూర్తి (రిటైర్డ్) అభయ్ మనోహర్ సప్రే, సభ్యుడు సంజయ్ బందోపాధ్యాయ్‌లు సంబంధిత శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ప్రమాదం జరిగిన కారణాలను కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అవినాష్‌ మహంతి ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను కమిటీకి వివరించారు. అనంతరం కమిటీ చైర్మన్ సాప్రే అధికారులు పలు సూచనలు చేశారు. ఆర్టీసీ బస్సులతో పాటు అన్ని కమర్షియల్‌ వాహనాల ఫిట్‌నెస్‌ను మరోసారి సమగ్రంగా తనిఖీ చేయాలని, ఫిట్‌నెస్‌ లేని వాహనాలను సీజ్‌ చేయాలని ఆదేశించారు. ప్రతి వాహనం ఇన్సూరెన్స్‌, పర్మిట్‌, ఫిట్‌నెస్‌ పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు.

జాతీయ రహదారుల విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలని NHAI అధికారులను ఆదేశించారు. మైనింగ్‌ క్వారీల నుండి పరిమితికి మించి లోడ్లు తరలించకుండా చూడాలని మైనింగ్‌, రవాణా శాఖలకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రోడ్డు భద్రత నిధిని ఏర్పాటు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. ఈ సమీక్ష సమావేశంలో రవాణా కమిషనర్‌ ఇలంబర్తి, అడిషనల్ డీజీ మహేశ్ భగవత్‌, సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి, మైనింగ్‌ డైరెక్టర్‌ భవేశ్‌ మిశ్రా, జెటీసీలు చంద్రశేఖర్‌ గౌడ్‌, శివలింగయ్య, ఆర్టీసీ, NHAI అధికారులు పాల్గొన్నారు.

Next Story