Raghunandan Rao: తెలంగాణలోనూ భారీగా దొంగ ఓట్లు.. బాంబు పేల్చిన మెదక్ ఎంపీ

by Prasad Jukanti |   (  Updated:2025-08-13 12:21:44  IST  )

తన పార్లమెంట్ పరిధిలో దొంగ ఓట్లు ఉన్నాయని మెదక్ ఎంపీ రఘునందన్ రావు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ని కలిసి ఫిర్యాదు చేశారు.

Raghunandan Rao: తెలంగాణలోనూ భారీగా దొంగ ఓట్లు.. బాంబు పేల్చిన మెదక్ ఎంపీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఓట్ల చోరీ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపణలు చేస్తున్న వేళ తెలంగాణలోనూ దొంగ ఓట్లు ఉన్నాయని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పార్లమెంట్ నియోజకవర్గం మెదక్ పరిధిలో దొంగ ఓట్లు ఉన్నాయని ఇవాళ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం రఘునందన్‌రావు మీడియాతో మాట్లాడారు. దొంగ ఓట్లను నిరూపించేందుకు తాను సిద్ధమని, జిల్లా కలెక్టర్ వస్తారా? రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా అధికారులను పంపిస్తుందా..? అని చాలెంజ్ చేశారు. తన లోక్‌సభ పరిధిలోని పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గం ఐలాపూర్ గ్రామంలో 1,000 లోపు ఓటర్లు ఉంటే ఓటరు జాబితాలో మాత్రం 2,400 మంది ఓటర్లు ఉన్నారని ఆరోపించారు. గ్రామపంచాయతీ ఓటర్ లిస్టులో భారీగా అవకతవకలు జరిగాయని, పార్లమెంట్ ఎన్నికలకు ముందు నుంచే తాము జిల్లా కలెక్టర్, ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఉన్న ఓటర్ల జాబితాకు 2025 జనవరిలో ప్రకటించిన ఓటర్ల జాబితాపై తప్పనిసరిగా రివ్యూ జరగాలని డిమాండ్ చేశారు.

రాహుల‌వి బాధ్యతారహిత వ్యాఖ్యలు

బిహార్‌లో ఓట్ల సవరణ చేస్తుంటే ఓట్ల చోరీ అంటూ కొంత మంది నాయకులు బాధ్యతారాహిత్యమైన మాటలు మాట్లాడుతున్నారని రాహుల్‌గాంధీని ఉద్దేశించి రఘునందన్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ చేసిన ఆరోపణలు తప్పు అని మాట్లాడినందుకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కర్ణాటక‌లో కేబినెట్ నుంచి ఓ మంత్రిని బలవంతంగా రాజీనామా చేయించారని దుయ్యబట్టారు. విపక్షాలు బిహార్ ఓటర్ల జాబితా సవరణను తప్పు పడుతున్నారని, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ఎందుకు అవసరమో దేశ ప్రజల ముందు ఉంచేందుకు ఐలాపూర్ గ్రామ పంచాయతీని ఉదాహరణగా చెబుతున్నాన్నారు.

Next Story