రేషన్ బియ్యం నాణ్యతలో అధికారులు రాజీ పడొద్దు: స్టీఫెన్ రవీంద్ర

by Gantepaka Srikanth |

పేదలు సంపన్నులతో సమానంగా సన్నబియ్యంతో భోజనం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు రాష్ర్ట పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శి స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు.

రేషన్ బియ్యం నాణ్యతలో అధికారులు రాజీ పడొద్దు: స్టీఫెన్ రవీంద్ర
X

దిశ, తెలంగాణ బ్యూరో: పేదలు సంపన్నులతో సమానంగా సన్నబియ్యంతో భోజనం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు రాష్ర్ట పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శి స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. బియ్యం నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. శుక్రవారం బాగ్ లింగంపల్లిలోని పౌరసరఫరాల గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేసి నిల్వ ఉన్న బియ్యం సంచులను తెరిపించి నాణ్యతను పరిశీలించారు. బియ్యంలో నూకల శాతం, తేమ శాతం వంటి అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గోదాముకు వచ్చిన బియ్యాన్ని స్వీకరించే దశలోనే క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిల్వలను తిరస్కరించాలని గోదాం ఇన్‌చార్జీలకు సూచించారు. ఈ విషయంలో ఏమాత్రం రాజీ పడినా కఠిన చర్యలు ఉంటాయని, ప్రజలకు చేరే ప్రతి బియ్యం గింజ నాణ్యమైనదిగా ఉండేలా చూడాలన్నారు.

ఆలస్యం జరగకుండా చర్యలు..

సరఫరా వ్యవస్థలో పారదర్శకత కోసం స్టాక్ రిజిస్టర్లు, ఇన్‌వర్డ్–అవుట్‌వర్డ్ వివరాలు, రవాణా రికార్డులను కమిషనర్ పరిశీలించారు. రేషన్ షాపులకు బియ్యం సరఫరాలో ఎలాంటి ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోదాములో పని చేస్తున్న హమాలీలతో మాట్లాడి పనివాతావరణం, సౌకర్యాలపై వివరాలు తెలుసుకుని తమ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసమే మా బలమని, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే నాణ్యతే ప్రమాణం కావాలి. రేషన్ బియ్యం విషయంలో చిన్న తప్పిదం జరిగిన సహించేది లేదన్నారు. ఈ తనిఖీలో హైదరాబాద్ జిల్లా మేనేజర్ సాయి అరుణ్, దీప్తి, గోదాం ఇన్‌చార్జీలు గోపాలకృష్ణ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story