Breaking: ఆర్జీవీకి షాక్.. ‘వ్యూహం’ సినిమా విడుదలపై స్టే

by Disha Web Desk 16 |
Breaking: ఆర్జీవీకి షాక్.. ‘వ్యూహం’ సినిమా విడుదలపై స్టే
X

దిశ, వెబ్ డెస్క్: దర్శకుడు ఆర్జీవీకి బిగ్ షాక్ తగిలింది. ఆయన తెరకెక్కించిన ‘వ్యూహం’ మూవీ విడుదలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ నెల 22 వరకూ సినిమా విడుదలను నిలిపివేయాలని ఆదేశించింది. అదే రోజు తీర్పు వెల్లడిస్తామని జడ్జి స్పష్టం చేశారు.

కాగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ ‘వ్యూహం‘ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రానికి సీబీఎఫ్‌సీ సర్టిఫికెట్ జారీ అయింది. అయితే ఈ చిత్రంలోని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఏపీకి చెందిన రెండు పార్టీల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. అటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. తన తండ్రి చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేలా సినిమాలో సన్నివేశాలు చిత్రీకరించారని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ‘వ్యూహం’ చిత్రానికి జారీ చేసిన సీబీఎఫ్‌సీ సర్టిఫికెట్‌ను కోర్టు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో ‘వ్యూహం‘ సినిమా నిర్మాత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘వ్యూహం’ మూవీ సీబీఎఫ్‌సీ జారీ చేసిన సర్టిఫికేట్‌ను నిలిపివేస్తూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ఆయన సవాల్ చేశారు. ఆ ఉత్తర్వులను తొలగించాలని పిటిషన్‌లో కోరారు. ఒక వేళ ఏపీలో ఎన్నికలపై ప్రభావం ఉంటుందనుకుంటే తెలంగాణలోనైనా రిలీజ్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ధర్మాసనం ఎదుట విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. ‘వ్యూహం’ సినిమా విడుదలపై స్టే విధించింది.


Next Story

Most Viewed