మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫోన్ మిస్సింగ్..!

by Dishafeatures2 |
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫోన్ మిస్సింగ్..!
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫోన్ మాయమైంది. శుక్రవారం జనగామ జిల్లా చిల్పూర్ గుట్టపై జరిగిన శ్రీ బుగులు వేంకటేశ్వరస్వామి కల్యాణమహోత్సవానికి ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. ఈ క్రమంలోనే స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి గుట్టపై ఉన్న మూల విరాట్ దేవాలయం నుంచి కింద ఉన్న కల్యాణ వేదికకి మంత్రి కాలినడకన వెళ్లారు. ఈ క్రమంలో కల్యాణ వేదిక వద్ద ఒక్కసారిగా భక్తులు తోసుకువచ్చారు. దీంతో మంత్రి జేబులో ఉన్న ఫోన్ కింద పడగా గుర్తు తెలియని భక్తులు ఆ ఫోన్ ను తీసుకున్నారు.

ఫోన్ మిస్సైనట్లు తెలుసుకున్న మంత్రి సిబ్బంది సాయంతో ఎవరికైనా ఫోన్ దొరికితే ఇవ్వాలని మైక్ లో అనౌన్స్ మెంట్ కూడా చేశారు. కానీ ఎవరూ ఫోన్ తిరిగి ఇవ్వలేదు. కార్యక్రమం పూర్తి చేసుకున్నాక మంత్రి అక్కడి నుంచి హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లారు. తీరా చూస్తే మంత్రి ఫోన్ కార్ లోనే ఉంది. దేవాలయంలోకి వెళ్లే ముందు మంత్రి ఎర్రబెల్లి తన సెల్‌ఫోన్‌ను కారులోనే మరిచిపోయి వెళ్లారట. ఈ విషయం తెలుసుకొని అందరూ నవ్వుకున్నారు. ఇక అధికారులు హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకున్నారు.



Next Story

Most Viewed