తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు SS రాజమౌళి

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-06 12:37:52  IST  )

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు SS రాజమౌళి

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు SS రాజమౌళి
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్‌ 8, 9 తేదీల్లో జరగనున్న తెలంగాణ రైజింగ్​గ్లోబల్ సమ్మిట్ 2025కు దేశ విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులు, విద్యావేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. రాష్ట్ర భవిష్యత్తును ఆవిష్కరించే దిశగా జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్‌లో రెండు రోజులపాటు మొత్తం 27 ప్రత్యేక ప్యానెల్ చర్చలు జరుగుతాయి. ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ–సెమీకండక్టర్లు, హెల్త్‌, ఎడ్యుకేషన్‌, టూరిజం, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, వ్యవసాయం, పరిశ్రమలు, మహిళా వ్యాపారవేత్తల ప్రోత్సాహం, గిగ్ ఎకానమీ, సామాజిక సంక్షేమం, స్టార్టప్‌లు వంటి విభిన్న రంగాలపై చర్చలు ఉంటాయి. పీవీ సింధు, అనిల్ కుంబ్లే, పుల్లెల గోపిచంద్, గగన్ నారంగ్, జ్వాలా గుత్తా వంటి క్రీడా ప్రముఖులు ‘Olympic Gold Quest’ సెష న్‌లో పాల్గొంటారు.

రాజమౌళి, రితేష్ దేశ్‌ముఖ్, సుకుమార్, గుణీత్ మోంగా, అనుపమా చోప్రా వంటి సినీ ప్రముఖులు ‘Creative Century – Soft Power & Entertainment’ చర్చలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రులు, అన్ని విభాగాల ఉన్నతాధికారులు ఈ సమ్మిట్​నిర్వహణ ఏర్పాట్లతో పాటు సదస్సుకు తరలివచ్చే ప్రతినిధులను సమన్వయం చేస్తున్నారు. దావోస్ లో ప్రతి ఏటా జరిగే వరల్డ్ ఎకనామిక్​ ఫోరమ్‌ను తలపించేలా అంతర్జాతీయ స్థాయిలో ఈ సదస్సు జరగాలని ముఖ్యమంత్రి స్వయంగా ఈ సదస్సు ఏర్పాట్లను నిరంతరం సమీక్షిస్తున్నారు. అధికారులతో ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించారు.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు వేదికలో రెండో రోజైన డిసెంబర్​ 9న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్​ 2047 విజన్​ డాక్యమెం​ట్ ను ఆవిష్కరిస్తుంది. 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్‌ మ్యాప్‌ను ఈ డాక్యుమెంట్‌లో పొందుపరిచారు. రెండు రోజుల పాటు జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో అన్ని రంగాల్లో భవిష్యత్తు తెలంగాణ అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు, టెక్నాలజీ భాగస్వామ్యాలు, నూతన ఆవిష్కరణల దిశగా సమగ్ర ప్రణాళికలను పొందుపరిచారు.

Next Story