రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు.. అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

by Kema Shiva Kumar |

తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు.. అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించాలని ఆయన ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు ఎండల తీవ్రత దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున తాగునీటి ఎద్దడి కలగకుండా, వడదెబ్బ మరణాలు సంభవించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఇక అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లు, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని, ఆయా జిల్లాల యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.

Next Story