ఒకే మండలంలో 40 మంది గ్రూప్-1 క్వాలిఫై.. సిట్ విచారణలో సంచలన విషయాలు..!

by Disha Web Desk 19 |
ఒకే మండలంలో 40 మంది గ్రూప్-1 క్వాలిఫై.. సిట్ విచారణలో సంచలన విషయాలు..!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దూకుడు పెంచింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించిన సిట్.. వారు ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రాజశేఖర్ సొంత మండలమైన మల్యాలలో మంగళవారం సిట్ అధికారులు విచారణ చేపట్టారు.

ఐదు బృందాలుగా ఏర్పడి సిట్ అధికారులు దర్యాప్తు కొనసాగించారు. నిందితుడు రాజశేఖర్ సొంత గ్రామమైన తాటిపల్లిపై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇక, మల్యాల మండలంలో దాదాపు 40 మంది అభ్యర్థులు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. దీంతో ప్రతి అభ్యర్థి ఇంటికి వెళ్లి అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులు ఎక్కడ శిక్షణ తీసుకున్నారనే వివరాలు అధికారులు సేకరిస్తున్నారు. అంతేకాకుండా ఆ అభ్యర్థుల విద్యార్హతలు, ఇప్పటి వరకు ఎక్కడ చదివారనే దానిపైన అధికారులు కూపీ లాగుతున్నారు. అభ్యర్థుల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల వివరాలను సైతం సేకరిస్తున్నారు.

Next Story