సంక్షోభంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ! సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ

by Disha Web Desk 14 |
సంక్షోభంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ! సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: సిరిసిల్ల నేత కార్మికుల బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన శుక్రవారం లేఖ రాశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం వలన గత 4 నెలలుగా యజమానులు, నేత కార్మికులు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి రావలసిన పాత బకాయిలు 270 కోట్ల రూపాయలు ఇంతవరకు చెల్లించలేదన్నారు. కొత్త ఆర్డర్లు ఇవ్వడం లేదని, ఫలితంగా వస్త్ర పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి పని చేస్తున్న దాదాపు 20 వేల మంది పవర్ లూమ్, అనుబంధ రంగాల కార్మికులు పనుల్లేక పస్తులుంటున్నారని పేర్కొన్నారు. అప్పులు చేస్తూ ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ క్రమంలోనే వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని గత 27 రోజులుగా చేనేత కార్మికులు సమ్మె చేస్తున్నారని, కానీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు కనీస స్పందన లేకపోవడం బాధాకరమన్నారు.

గత ప్రభుత్వం బతుకమ్మ చీరలను నేయాలంటూ ఆసాములను, యజమానులపై ఒత్తిడి చేసి పాత వ్యాపారాలను బంద్ చేయించిందని ఆరోపించారు. ఆ తర్వాత మాస్టర్ వీవర్స్ పేరుతో పెద్ద యజమానులకు బతుకమ్మ చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చి చిన్న యజమానులను, ఆసాములుగా కూలీలుగా మార్చిందని విమర్శించారు. బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేసిన యజమానులకు ప్రభుత్వం నుంచి సక్రమంగా పేమెంట్లు రాకపోవడంతో దాదాపు రూ.270 కోట్ల మేరకు బకాయిలు పేరుకుపోయాయని వివరించారు. దీంతో వ్యాపారాలు చేయడానికి డబ్బుల్లేక, కొత్త ఆర్డర్లు లేక యజమానులు వస్త్ర పరిశ్రమను బంద్ పెట్టారని వెల్లడించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని, విద్యుత్ సబ్సిడీలను కొనసాగించాలని లేఖలో కోరారు.


Next Story