సింగరేణి వివాదం: మేజిస్ట్రేట్ ముందు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ హాజరు

by Ramesh Naini |

సింగరేణి వ్యవహారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను నాంపల్లి పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.

సింగరేణి వివాదం: మేజిస్ట్రేట్ ముందు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ హాజరు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సింగరేణి వ్యవహారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను నాంపల్లి పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మధ్యాహ్నం అరెస్టు చేసిన అనంతరం సుదీర్ఘంగా విచారించి, వైద్య పరీక్షల అనంతరం ఆయనను హిమాయత్ నగర్‌లోని జడ్జి నివాసంలో ప్రవేశపెట్టారు.

సుదీర్ఘ విచారణ.. ఆపై వైద్య పరీక్షలు

సింగరేణి సంస్థకు సంబంధించి బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ మధ్యాహ్నం ఆయనను అరెస్టు చేసిన పోలీసులు, దాదాపు 7 గంటల పాటు నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ విచారణలో భాగంగా బాల్క సుమన్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. పోలీస్ విచారణ పూర్తయిన అనంతరం, బాల్క సుమన్‌ను వైద్య పరీక్షల నిమిత్తం కింగ్ కోఠిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆయనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

జడ్జి నివాసంలో హాజరు

కింగ్ కోఠి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు ముగిసిన వెంటనే, బాల్క సుమన్‌ను పోలీసులు భారీ బందోబస్తు మధ్య నేరుగా హిమాయత్ నగర్‌లోని మేజిస్ట్రేట్ (జడ్జి) నివాసానికి తీసుకెళ్లారు. అక్కడ జడ్జి ఎదుట ఆయనను హాజరుపరిచారు. తదుపరి న్యాయ ప్రక్రియ కొనసాగుతోంది.

Next Story