రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకో కవితమ్మ.. షర్మిల

by Dishafeatures2 |
రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకో కవితమ్మ.. షర్మిల
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్సీ కవిత నిజంగా లిక్కర్ స్కాంలో అవినీతికి పాల్పడకపోతే తన పదవికి రాజీనామా చేసి, తెలంగాణ ప్రజల ముందు నిజాయతీని నిరూపించుకోవాలని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు సవాల్ చేశారు. ఈ మేరకు ఆమె గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు నీ బండారం బట్టబయలైతే అవి మీడియా ప్రసారం చేస్తే.. పాత్రికేయులకు, మీడియా సంస్థలకు విలువలు లేవని మాట్లాడుతున్న నీకు.. ఏం విలువ ఉన్నట్టు?’ అని నిలదీశారు. బతుకమ్మ ముసుగులో లిక్కర్ దందా చేసి, తెలంగాణ ఆడబిడ్డల ఇజ్జత్ తీసిన కవితమ్మ.. బురద చల్లడం అంటే ఏంటి జర చెప్పమ్మా.! అని విమర్శించారు. లిక్కర్ స్కాంలో రోజుకో ఎపిసోడ్ బయట పడుతుంటే నిజాలు రాయకుండా లిక్కర్ స్కాంతో ఘనకార్యం చేశావని నెత్తిన పెట్టుకోవాలా? ఆహా! ఓహో అని వార్తలు రాయాలా? అని ప్రశ్నించారు.

లేదా లిక్కర్ డాన్, లిక్కర్ క్వీన్ అంటూ బిరుదులు ఇవ్వమంటావా? అంటూ సెటైర్లు వేశారు. ఒక అనామకుడు ఆరోపణలు చేస్తే సీఎం కేసీఆర్ ఈటెల రాజేందర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. లిక్కర్ స్కాంకు పాల్పడ్డ తనను, సస్పెండ్ చేయకుండా రాచమర్యాదలతో కేసీఆర్ ప్రగతి భవన్ లో స్వాగతం పలికారన్నారు. బిడ్డను కాపాడుకునేందుకు కేసీఆర్ ఢిల్లీ వీధుల్లో తిరిగారని ఆరోపించారు. తోడుదొంగలంతా ఒక్కటైనట్లు మంత్రులంతా విరామం లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి పొగిడారని పేర్కొన్నారు. కవిత చేసిన తప్పుకు తెలంగాణ ప్రజలు నిలదీస్తారని, కానీ ఎప్పటికీ తలవంచరని వివరించారు. చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి పనికిమాలిన పనులు అంటూ తీవ్ర విమర్శలు చేశారు.


Next Story