200 సార్లు ఫోన్ చేసినా రేవంత్ రెడ్డి తీయడం లేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణలు

by Prasad Jukanti |   (  Updated:2026-03-08 11:06:31  IST  )

సీఎం రేవంత్ రెడ్డి తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆవేదన వ్యక్తం చేశారు.

200 సార్లు ఫోన్ చేసినా రేవంత్ రెడ్డి తీయడం లేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక నేను 200 సార్లు ఫోన్ చేసినా ఆయన తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎన్టీఆర్ కేబినెట్‍లోనే మంత్రిగా చేసిన తాను తన జాతి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్దామంటే తనకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. తాజాగా ఓ యూట్యూబ్ చానల్‍‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ఎస్సీ వర్గీకరణ వర్గీకరణ కోసం అమరులైన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం కోసం అడుగుదామని ప్రయత్నిస్తే అపాయింట్‍మెంట్ ఇవ్వడం లేదన్నారు. ఐదెకరాల భూమి ఇస్తే మాదిగ భవనం నిర్మించుకుంటామన్నారు.

అక్కడికి నన్ను పిలవలే:

మాదిగ ఎంప్లాయిస్ కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసిన కృతజ్ఞత కమిటీకి తనను పిలవలేదని మోత్కుపల్లి అన్నారు. ముఖ్యమంత్రి పిలవడం లేదు కాబట్టి నిర్వహాకులు కూడా తనను పిలవలేదేమో అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, ఎంత కాలం సీఎం పదవిలో ఉంటావో ఉండు నిన్ను మా భుజాన మోస్తామని చెప్పాను. అయినా ఏం పాపం చేశానో తెలియదు వందల సార్లు ఫోన్ చేసినా తనకు అపాయింట్‍మెంట్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరం అన్నారు. మాదిగ కులాన్ని రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదన్నారు. పార్లమెంట్ లో మాదిగలు అడుగు పెట్టవద్దన్నట్లు టికెట్లు ఇవ్వలేదు. రాజ్యసభ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా సరైన అవకాశం ఇవ్వకుండా మాదిగలు చట్టసభల్లో అడుగే పెట్టవద్దన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. వందల కార్పొరేషన్లు వేస్తే అందులో మాదిగలకు ఒక్కటే ఇచ్చారన్నారు. మా సమస్యలు పరిష్కరించకుండా మనం కలిసి ఉన్నాం కలిసి దావత్ లు చేసుకుందాం అంటే దానితో ఎవరికి సంతోషం అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిపై మాకు ఎలాంటి కోపం లేదని కానీ మా సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

మాదిగ మహాశక్తి సంస్థ:

రాజ్యాధికారం కోసం మాదిగలు సంఘటితం కావాల్సిన అవసరం ఉందని అందుకోసమే మాదిగ మహాశక్తి (MMS) అనే సంస్థను ప్రారంభించామన్నారు. ఇది రాజకీయ పార్టీ కాదని జాతి ప్రయోజనాల కోసం పని చేసే సంస్థ అన్నారు. రాజకీయంగా మాదిగల వద్ద ఓట్లు ఉన్నాయి. వీటిని సరిగా వాడుకుంటే అధికారంలో ఎవరినైనా ఉంచవచ్చు లేదా దించవచ్చు అన్నారు. మాదిగ మహాశక్తి డిసిషన్ మేకర్‍గా ఉండబోతోందన్నారు. చట్టసభల్లో మా హక్కులను తొలగించి అందరం కలిసి ఉంటామనడం ఏంటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తన జీవతంలో చేసిన ఒకే ఒక్క మంచి పని వర్గీకరణ అన్నారు. ఈ నిర్ణయంతో రేవంత్ రెడ్డిపై నాకున్న అభిప్రాయాన్ని మార్చుకుని కాంగ్రెస్ పార్టీకి మాదిగ జాతిని అనుకూలంగా చేయడం కోసం ఈ ఎంఎంఎస్ పెట్టానన్నారు. రేవంత్ రెడ్డి విషయంలో నేను పాజిటివ్ గానే ఉన్నానని కానీ నేను నెగిటివ్ అయ్యేలా ఆయనే చేసుకుంటున్నారని అన్నారు.

సీఎంతో చెడిందా?:

అయితే మోత్కుపల్లి తాజా కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారాయి. గతేడాది నవంబర్ లో జరిగిన అందెశ్రీ సంతాప సభలో సీఎంపై మోత్కుపల్లి ప్రశంసలు కురిపించారు. పేదోడి హృదయాన్ని గెలుచుకుంటున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నాళ్లు ఉంటావో ఉండు. మేము నిన్ను భుజాన మోస్తాం. నీ వెంట 59 కులాలు ఉండేలా చూస్తాం. మీరు నాకు ఏమివ్వక్కర్లేదు సమస్యల మీద మాట్లాడే అవకాశం ఇస్తే చాలు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అని అందరికంటే ముందే ప్రకటించింది నేను. అప్పుడు ఎన్టీఆర్ కోసమే జై కొట్టాను ఇప్పుడు మళ్లీ నీకోసమే జై కొడుతున్నా. ఇది కాపాడుకోవాల్సిన బాధ్యత నీది. అంటూ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే వ్యాఖ్యానించారు. అంతలా ఆకాశానికెత్తిన రేవంత్ రెడ్డిపై ఇప్పుడు మోత్కుపల్లి విమర్శలు గుప్పించడం హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ రెడ్డితో మోత్కుపల్లికి పూర్తిగా చెడిపోయిందా అందువల్లే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే మాదిగ ఎంప్లాయూస్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం విషయంలో ఎమ్మార్పీఎస్ (మందకృష్ణమాదిగ)కు కాంగ్రెస్ లోని మరో వర్గానికి మధ్య డైలాగ్ వార్ సాగుతున్న వేళ తాజాగా మోత్కుపల్లి తెరమీదకు రావడం ఆసక్తిగా మారుతోంది.
Next Story