బీసీ రిజర్వేషన్ల కోసం రాజీనామాలకు సిద్ధం కావాలి.. సత్యశోధక మహాసభ కమిటీ డిమాండ్

by Ajay Maddhiboyina |

: తెలంగాణ రాష్ట్ర సాధన ఏ లక్ష్యంతో జరిగిందో, అదే స్ఫూర్తితో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని సత్యశోధక మహాసభ కమిటీ పేర్కొంది. కమిటీ ప్రతినిధులు బుధవారం రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఆర్. కృష్ణయ్యలను కలిసి బీసీల హక్కులపై సుదీర్ఘంగా చర్చించారు.

బీసీ రిజర్వేషన్ల కోసం రాజీనామాలకు సిద్ధం కావాలి.. సత్యశోధక మహాసభ కమిటీ డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర సాధన ఏ లక్ష్యంతో జరిగిందో, అదే స్ఫూర్తితో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని సత్యశోధక మహాసభ కమిటీ పేర్కొంది. కమిటీ ప్రతినిధులు బుధవారం రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఆర్. కృష్ణయ్యలను కలిసి బీసీల హక్కులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీలో బీసీల రాజకీయ, సామాజిక సాధికారత కోసం అనుసరించాల్సిన కార్యాచరణను వారికి వివరించారు. కమిటీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు మరియు డిమాండ్లను వివరించారు. ​పదవుల కంటే హక్కులే ముఖ్యమని పేర్కొన్నారు. బీసీ కులగణన మరియు రిజర్వేషన్ల పెంపు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలన్నారు.

అవసరమైతే బీసీ హక్కుల కోసం MP, MLA, MLC పదవులతో పాటు ఇతర రాజకీయ పదవులకు రాజీనామాలు చేసేందుకు వెనుకాడకూడదని డిమాండ్ చేశారు. పార్టీలకు అతీతంగా బీసీ ప్రజాప్రతినిధులందరూ ఒకే వేదికపైకి వచ్చి రిజర్వేషన్ల పోరాటాన్ని ఉధృతం చేయాలన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా, అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం సత్యశోధక మహాసభ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ​బీసీ బిడ్డల భవిష్యత్తు కోసం, చట్టసభల్లో వాటా కోసం జరిగే ఈ మహా సంగ్రామంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

Next Story