ఎన్‌టీఆర్‌ భవన్‌లో సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతి

by Yella Dhawani Reddy |

ఎన్‌టీఆర్ భవన్‌లో సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ 375 జయంతి వేడుకలను తెలుగునాడు కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఘనంగా నిర్వహించింది.

ఎన్‌టీఆర్‌ భవన్‌లో సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్‌టీఆర్ భవన్‌లో సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ 375 జయంతి వేడుకలను తెలుగునాడు కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఘనంగా నిర్వహించింది. తెలుగునాడు కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు సూరగౌని గజేంద్రగౌడ్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సర్వాయి పాపన్నగౌడ్‌ చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు అరవింద్‌ కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ.. సర్వాయి పాపన్నగౌడ్‌ ఒక కులానికి చెందిన వ్యక్తి కాదని, ఆనాటి పాలకులు దుర్మార్గంగా పన్నులు వేసి ప్రజలను పీడిస్తూ బీసీలందరినీ ఇబ్బందులకు గురి చేస్తుంటే.. పాలకులకు ఎదురుగా నిలిచి పోరాడిన వ్యక్తి అని తెలిపారు. రాజ్యాధికారిన్ని ఎదిరించి అన్ని కులాలను సమీకరించి సైన్యాన్ని తయారు చేసుకుని సర్వాయి పాపన్న గౌడ్‌ చేసిన పోరాటంను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ స్ఫూర్తితోనే పెత్తందారుల వద్ద మోకరిల్లే పటేల్‌, పట్వారీ వ్యవస్థను ఎన్‌టీఆర్‌ ఒక్క కలం పోటుతో రద్దు చేశారని గుర్తుచేశారు. ఎన్టీఆర్‌ వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పంచడానికి రిజర్వేషన్‌లను తీసుకొచ్చారని, చంద్రబాబు అమలు చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వైన్‌షాపులలో గౌడ్‌లకు పది శాతం రిజర్వేషన్‌లను అమలు చేస్తున్నారు. ఆదరణ-2 పథకాన్ని అమలు చేస్తున్నారు. సామాజిక న్యాయానికి టీడీపీ నాంది పలికిందన్నారు. చంద్రబాబు హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడం వల్ల లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తున్న నగరంగా మారిందన్నారు. ట్యాంక్‌ బండ్‌ వద్ద సర్యాయి పాపన్న గౌడ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన చేయడాన్ని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి, అజ్మీరా రాజునాయక్‌, జాతీయ నాయకులు కొయ్యాడ స్వామి గౌడ్‌, సూరగౌని గజేంద్రగౌడ్‌, జగదీష్‌గౌడ్‌, లక్ష్యాగౌడ్‌, జిలాని బాషా, సాంబశివగౌడ్‌, నక్కా కృష్ణగౌడ్‌, రామాంజనేయగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Next Story