కొన్ని శక్తులు తీవ్రమైన దాడి చేశాయి.. ఆర్ఎస్పీ తీవ్ర ఆవేదన

by Disha Web Desk 16 |
కొన్ని శక్తులు తీవ్రమైన దాడి చేశాయి.. ఆర్ఎస్పీ తీవ్ర ఆవేదన
X

దిశ, తెలంగాణ బ్యూరో: తన రాజకీయ ప్రస్థానంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు మిమ్మల్ని బాధపెట్టి ఉండవచ్చని శ్రేయోభిలాషులను ఉద్దేశించి బీఆర్ఎస్ నాగర్‌కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. ఒక ఉన్నతమైన లక్ష్య సాధన కోసం కొన్ని త్యాగాలు తప్పవని ఆయన శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా.. తనపై సోషల్‌మీడియా వేదికగా కొన్ని శక్తులు తీవ్రమైన దాడి చేశాయని.. ఇంకా చేస్తూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అనాగరికమైన దాడులు తనకు కొత్త కాదని తెలిపారు. పేదల జీవితాలను సమూలంగా మార్చాలన్న లక్ష్యం నుంచి తనను ఈ చిల్లర రాజకీయాలు దూరం చేయలేవని స్పష్టం చేశారు.

ఇన్నాళ్లూ పీడిత ప్రజల కోసం నిస్వార్థంగా పని చేశానని తెలిపారు. చట్టసభల్లో అందరి గొంతుకగా ఉండాలనే లక్ష్యంతో.. ఎంతో విలువైన ఉద్యోగాన్ని సైతం వదిలి రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. అసెంబ్లీలో బహుజనుల గొంతుకగా ఉండాలని రాత్రింబవళ్లు శ్రమించినా మొదటి ప్రయత్నంలో విఫలమయ్యానన్నారు. తెలంగాణ వాదం – బహుజనవాదం రెండూ ఒక్కటేనని నమ్మి ఎంతో శ్రమించి కేసీఆర్‌, మాయావతిని ఒప్పించి తెలంగాణలో చారిత్రాత్మక పొత్తు ఏర్పాటయ్యేలా చూశానన్నారు. కానీ, కొన్ని అనివార్య కారణాలతో అది చివరి నిమిషంలో రద్దైందని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, దేశంలో కోట్లాది బహుజనుల బంగారు భవిష్యత్తు కోసం, భారత రాజ్యాంగ విలువల రక్షణ కోసం, కేసీఆర్‌తోనే కలిసి ప్రయాణించాలనుకున్నానని తెలిపారు. బీజేపీ కుట్రల నుంచే దేశాన్ని రక్షించే దమ్ము-ధైర్యం కాంగ్రెస్‌కు ముమ్మాటికీ లేదని, అందుకే బీఆర్‌ఎస్‌లో చేరానని స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్‌ మార్గదర్శనంలో సర్వశక్తులొడ్డి విజయం కోసం పోరాడతానని స్పష్టం చేశారు. తనతో కలిసి రావాలని.. చేతనైతే సాయం చేయాలని పిలుపునిచ్చారు. తాను చట్టసభల్లో కూర్చుంటే అందరూ అక్కడ కూర్చున్నట్టే.. ‘నేను నేను కాదు.. నేను మీరే’అని ట్విట్టర్‌లో తెలిపారు.



Next Story