‘బాధ పడకు.. బయటకొచ్చి పులిలా గర్జించు బ్రదర్’.. ఐపీఎస్ అధికారికి RSP సంచలన సూచన

by Gantepaka Srikanth |

సీఐడీ మాజీ చీఫ్(Former CID chief), సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌(PV Sunil Kumar)పై విచారణకు అథారిటీని వేస్తూ ఏపీ ప్రభుత్వం(AP Govt) ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే.

‘బాధ పడకు.. బయటకొచ్చి పులిలా గర్జించు బ్రదర్’.. ఐపీఎస్ అధికారికి RSP సంచలన సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: సీఐడీ మాజీ చీఫ్(Former CID chief), సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌(PV Sunil Kumar)పై విచారణకు అథారిటీని వేస్తూ ఏపీ ప్రభుత్వం(AP Govt) ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఆయనపై వచ్చిన అభియోగాలపై విచారణ అథారిటీని ఏర్పాటు చేసింది. తాజాగా.. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కమార్(RS Praveen Kumar) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్టు పెట్టారు. ‘డీజీపీ ర్యాంకులో ఉన్న ఆంధ్రా ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ చేసిన ఘోరమైన తప్పు ఆయన మాల(ఎస్సీ) కులంలో పుట్టడమే. ఆయన పేరు చివరన రాజు/నాయుడు/చౌదరి/రెడ్డి/వర్మ/శర్మ లాంటి పేర్లు లేక పోవడమే ఆయన పాలిట శాపమైంది. ఇది ముమ్మాటికీ నిజం. మరో విషయం.. నేను పైన చెప్పిన అన్ని కులాల్లో నాకు ఆత్మీయులు ఉన్నారు. అది వేరే విషయం’ అని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

అంతేకాదు.. ‘వందల కోట్లు బ్యాంకులను ముంచి, ఎమ్మెల్యేగా ఎన్నికై దర్జాగా తిరుగుతున్న రఘురామకృష్ణం రాజు గారు జైలు బయట ఉండటమేంటి. మూడు దశాబ్దాలుగా దేశానికి సేవలు చేసిన ఒక నిఖార్సయిన పోలీసు అధికారి పోస్టింగ్ లేకుండా మౌనంగా రోదిస్తూ, అక్రమ కేసుల చిత్ర హింసను ఎదుర్కోవడం ఏంటి?. నేను పీవీ సునీల్ గారు 1998 నుండి కలిసి పనిచేశాం. ఆయనకు చాలాసార్లు ప్రభుత్వాలు అన్యాయం చేశాయి. అందరి లాగా నాకూ ప్రాధాన్యత ఉన్న పోస్టులు ఇవ్వండి అని వేడుకున్నా అగ్రనాయకుల గుండెలు కరగలేదు’ అని తెలిపారు.

‘ఈ వివక్ష ఏ మీడియాకు కనిపించదు. ఎందుకంటే వాళ్లకు ఎవరిని బజారున పడేయాలి, ఎవరిని ఎప్పుడు కాపాడుకోవాలి అనేది బాగా తెలుసు. అణిచివేయబడ్డ వర్గాలకు మీడియా ఎప్పుడూ అండగా ఉండదు. ఇక 79% ఆధిపత్య వర్గాలతో నిండిన న్యాయవ్యవస్థలో పీవీ సునీల్ కుమార్ లాంటి అణిచివేతకు గురవుతున్న అధికారికి ఉపశమనం దొరుకుతుందన్న ఆశ కూడా లేదు. అందుకే ఒకప్పుడు చంద్రబాబు గారు, మాజీ మంత్రి రోజా గారు ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని అన్నారు. బ్రదర్ పీవీ సునీల్ ఇక మౌనం వీడు. ప్రజా క్షేత్రంలో అడుగుపెట్టు. పులిలా గర్జించు. ఎంక్వైరీలను పట్టించుకోకు’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు.




Next Story